
దిగుమతి భారం తగ్గించేందుకే ఆయిల్పామ్ సాగు
గోవిందరావుపేట: దేశంలో వంటనూనె దిగుమతి భారాన్ని తగ్గించేందుకే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తోందని జిల్లా ఉద్యాన అధికారి దండు సంజీవరావు అన్నారు. మండల పరిధిలోని రాంనగర్ గ్రామంలో రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవరావు మాట్లాడుతూ దేశంలో వంట నూనె ఉత్పత్తి 16.69 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా 33.20 మిలియన్ మెట్రిక్ టన్నుల వినియోగం జరుగుతుందన్నారు. దేశంలో పామ్ ఆయిల్ 259 లక్షల టన్నులు వినియోగానికి అవసరం కాగా 100 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని, 67% పామాయిల్ ఇతర దేశాలనుంచి సుంకం చెల్లించి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. దేశంలో 13.24 లక్షల ఎకరాల్లో సాగు ఉండగా ఇంకా 70 లక్షల ఎకరాల్లో సాగు కావాలన్నారు. ప్రభుత్వం రాయితీ, సబ్సిడీతో మొక్కలు, పరికరాలు ఇస్తుందని, ఆసక్తి ఉన్న రైతులు సమీప ఆయిల్పామ్ ప్రతినిధి, ఉద్యాన అధికారులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీకాంత్, కేఎన్ బయో సైన్స్ మండల ప్రతినిధి సురేష్, నవీన్ నాయక్, రైతులు సోనియా నాయక్, భూక్య మోహన్, సీతారాం, సమ్మయ్య, సారక్క, రజిత, శారద తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఉద్యాన అధికారి సంజీవరావు