
భూ భారతిపైనే ఆశలు
ములుగు రూరల్: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ను తొలగించి భూ భారతిని తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఒక్కో మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. దీంతో భూ సమస్యలు పరిష్కారమై పట్టాలు జారీ అవుతాయనే ఆశతో రైతన్నలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని పాస్పుస్తకాలు ఉన్నవారికి మాత్రమే అందించడంతో లేని వారు భూభారతి చట్టంపై ఆశలు పెట్టుకున్నారు.
3 నుంచి 18వరకు రెవెన్యూ సదస్సులు
జిల్లాలోని పది మండలాలు ఉండగా వెంకటాపురం(ఎం) మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. మిగతా మండలాల్లో ఈ నెల 3 నుంచి 18వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 327 రెవెన్యూ గ్రామాలు ఉండగా 297 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల్లో మిస్సింగ్ సర్వే నంబర్, పెండింగ్ మ్యూటేషన్, విస్తీర్ణంలో తేడాలు, ఆక్రమణలు, పట్టాదారుడి పేరు సవరణ, నిషేధిత భూముల నుంచి తొలగింపు, అసైండ్ భూముల క్రమబద్ధీకరణ, సాదాబైనామా, వారసత్వం, భూ సేకరణ వంటి సమస్యలపై బాధితులు ఫిర్యాదులు అందించారు.
సమస్యలు ఇలా..
జిల్లా వ్యాప్తంగా మొత్తం దరఖాస్తులు 8,504 రాగా ఇందులో సాదాబైనామా దరఖాస్తులు 7,894 ఉన్నాయి. పోడు భూమికి సంబంధించి 53, అసైండ్ భూమి పార్టేషన్ 208, నూతన అసైన్డ్ మెంట్ 151, పీఓటీ 21, సర్వే 4, సర్వే ఎర్రర్ 1, నాలా 1, ఇంటి స్థలం 1, ఖాతా మెర్జింగ్ 4, కోర్టు కేసులు 3, భూదాన్ ల్యాండ్ 1, ఎల్పీజీ 18, గిఫ్ట్డీడ్ 11, సర్వే నంబర్ మిస్సింగ్ 1, ఇతరులపై పట్టా ఎంట్రీ 9, నాన్ ట్రైబల్స్ 1/70 యాక్టు 96, పసుపు కుంకుమలు 24, ఆధార్ కరెక్షన్ 1, ల్యాండ్ డిస్ప్ట్ 2 వంటి సమస్యలు పరిష్కరించాలని రైతులు అధికారులకు వినతులు అందజేశారు.
ఆన్లైన్ ప్రక్రియ పూర్తి ..
జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేశాం. ప్రభుత్వ నిబంధనల మేరకు దరఖాస్తులను పరిశీలించి సర్వే చేపట్టి భూ భారతి చట్టంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తాం.
– మహేందర్ జీ, అదనపు కలెక్టర్(రెవెన్యూ)
మండలాల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలు
మండలం దరఖాస్తులు
ములుగు 4,589
గోవిందరావుపేట 1,239
ఎస్ఎస్తాడ్వాయి 661
ఏటూరునాగారం 113
కన్నాయిగూడెం 303
మంగపేట 1,179
వాజేడు 217
వెంకటాపురం(కె) 203
భూమి పట్టాల కోసం 8,504మంది రైతుల దరఖాస్తులు
అధికంగా సాదాబైనామా ఫిర్యాదులు
ముగిసిన రెవెన్యూ సదస్సులు

భూ భారతిపైనే ఆశలు