
వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి
ములుగు రూరల్: ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రజలు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు సూచించారు. మండల పరిధిలోని రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని రాంచంద్రాపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ఆయన బుధవారం సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన కిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ధారణ పరీక్షల్లో హైపర్ టెన్షన్, టీబీ, డయాబెటీస్, సుఖ వ్యాధులు, హెచ్ఐవీ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయాలన్నారు. ప్రజలు శారీరక శ్రమ, ఆరోగ్య సూత్రాలను పాటించడంతో పాటు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోషకాహారాన్ని తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో అందించడం ఆరోగ్య కార్యకర్తల బాధ్యత అన్నారు. ఇమ్యూనైజేషన్ డ్యూ, వ్యాక్సిన్, వీవీఎం, కండిషనింగ్ ఐస్ ప్యాక్, రిజిస్టర్లను పరిశీలించారు. దోమలు వృద్ధి చెందకుండా పంచాయతీ సిబ్బందితో స్ప్రే చేయించాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యాధి నిరోధక టీకాలు, నియంత్రణ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ రణదీర్, డెమో సంపత్, హెచ్ఐవీ ప్రోగ్రాం మేనేజర్ జ్యోతి, ఆరోగ్య కార్యకర్తలు శ్రీలత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
డీఎంహెచ్ఓ గోపాల్రావు