రామప్ప దేవాలయం అద్భుతం
ఆలయ విశిష్టతను వివరిస్తున్న సూర్యకిరణ్, రామప్ప ఆలయంలో బెల్జియం దేశస్తులు
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయ నిర్మాణం అద్భుతంగా ఉందని బెల్జియం, అమెరికాకు చెందిన పలువురు కొనియాడారు. మండల పరిధిలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని శనివారం 30మంది బెల్జియం దేశస్తులు సందర్శించారు. వారు రామలింగేశ్వర స్వామిని దర్శించుకోగా పూజారులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, గైడ్ విజయ్కుమార్లు ఆలయ విశిష్టత గురించి విదేశీయులకు వివరించారు. ఈ సందర్భంగా బెల్జియం దేశస్తులు మాట్లాడుతూ భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు అంటే తమకు ఇష్టమని తెలిపారు. వరంగల్లో జరిగే పెళ్లి వేడుకలకు హాజరై రామప్ప ఆలయ సందర్శనకు వచ్చినట్లు వివరించారు. రామప్ప దేవాలయం మరుపురానిదని తెలిపారు. అనంతరం ఆలయం ఎదుట చిరు దుకాణాల్లో వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేశారు. అదే విధంగా గాజులు కొనుగోలు చేసి చేతులకు ధరించారు.
ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం
రామప్ప ఆలయ కట్టడం, శిల్పాలు ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనమని అమెరికాకు చెందిన షు ఉరే, జోనథన్ ఓల్సాన్లు అన్నారు. రామప్ప ఆలయాన్ని శనివారం ఉదయం వారు సందర్శించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ ద్వారా తెలుసుకున్నారు. రామప్ప ఆలయ శిల్పాలను తమ కెమెరాల్లో బంధించుకున్నారు.