సంకెళ్ళ నుంచి స్వేచ్ఛ వచ్చింది! | WAVES 2025: Saif Ali Khan admits of high global reach from streaming platform than his theatrical releases | Sakshi
Sakshi News home page

సంకెళ్ళ నుంచి స్వేచ్ఛ వచ్చింది!

May 4 2025 2:53 AM | Updated on May 4 2025 2:53 AM

WAVES 2025: Saif Ali Khan admits of high global reach from streaming platform than his theatrical releases

‘వేవ్స్‌’లో నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌

ఓటీటీ వేదికలు వచ్చాక వినోద రంగంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ ఆ మాటే అంగీకరించారు. ముంబైలో జరుగుతున్న ‘వరల్డ్‌ ఆడియో – విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌’ (వేవ్స్‌)లో మూడో రోజైన శనివారం సైఫ్‌ మెరిశారు. స్ట్రీమింగ్‌ వేదికలతో ఆవిర్భవించిన నవభారతం గురించి జరిగిన చర్చావేదికలో ఆయన పాల్గొన్నారు. ‘‘సినీ రంగానికి చెందిన మేము గతంలో గిరి గీసుకొని నిర్ణీత విధానాలకే కట్టుబడాల్సి వచ్చేది. కానీ, స్ట్రీమింగ్‌ వేదికలు అందుబాటులోకి వచ్చాక నటీనటులకూ, సినీ రూపకర్తలకూ మునుపటి సంకెళ్ళ నుంచి స్వేచ్ఛ లభించింది. 

మా కథలను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జనం చూసే వీలు చిక్కింది. సాంప్రదాయిక సినిమా మీడియమ్‌లో అయితే ఆ వీలుండేది కాదు’’ అని సైఫ్‌ అభి్రపాయపడ్డారు. నెట్‌ఫ్లిక్స్‌ కో–సీఈఓ టెడ్‌ సరండోస్‌ సైతం, ‘‘స్ట్రీమింగ్‌ వేదికల వల్ల భారత్‌లో సినీ రూపకల్పనలో ప్రజాస్వామ్యం సాధ్యమైంది’’ అన్నారు. డిజిటల్‌ యుగంలో కథాకథనంలో వస్తున్న మార్పులు, సృజనాత్మక స్వేచ్ఛపై స్ట్రీమింగ్‌ ప్రభావం, ప్రపంచ వినోదపటంలో పెరుగుతున్న భారత్‌ స్థానం లాంటి పలు అంశాలపై ఈ గోష్ఠిలో దృష్టి సారించారు.

‘‘ఇప్పుడు ప్రేక్షకులు చూసేందుకు విభిన్నమైన కథలు అనేకం ఏకకాలంలో అందుబాటులో ఉన్నాయి. అంతటి వైవిధ్యమైన కథలను తెరపై చెప్పే స్వేచ్ఛ సృజనశీలురకు దక్కింది. సినిమా రూపకల్పనలో ప్రజాస్వామ్యమంటే ఇదే’’ అని సైఫ్‌ అన్నారు. ‘‘ఎన్ని మార్పులు వచ్చినా, సినిమాలకు కాలం చెల్లదు. ఇంకా చె΄్పాలంటే, స్ట్రీమింగ్, థియేటర్లు... రెండూ పరస్పరం పోటీదారులు కావు. ముందున్న మార్కెట్‌ పెద్దది గనక, రెండూ ఏకకాలంలో కొనసాగుతాయి’’ అని టెడ్‌ విశ్లేషించారు. కోవిడ్‌ అనంతరం భారతదేశ వ్యాప్తంగా వందకు పైగా పట్టణాలు, నగరాల్లో, దాదాపు పాతిక వేల మంది స్థానిక నటీనటులు, సాంకేతిక వర్గంతో నెట్‌ఫ్లిక్స్‌ చిత్రీకరణ సాగించిందనీ, తద్వారా ఎందరికో ఉపాధి కల్పించిందనీ ఆయన వివరించారు.

నటించే ముందు ఊహించుకోవాలి!  – హీరో ఆమిర్‌ ఖాన్‌    
‘‘పాత్రను పూర్తిగా అవగాహన చేసుకొని, దానిలోకి పరకాయ ప్రవేశం చేయాలి. నా వరకు నేను స్క్రిప్టుతో చాలా సమయం గడుపుతాను. పదే పదే స్క్రిప్టు చదువుతాను. స్క్రిప్టు బాగుంటే, ఆ పాత్ర, దాని రూపురేఖలు, మానసిక వైఖరి అన్నీ దాని నుంచే అర్థమైపోతాయి. పాత్ర, కథ గురించి దర్శకుడితో చర్చల వల్ల కూడా ఓ అవగాహన వస్తుంది’’ అన్నారు ఆమిర్‌ ఖాన్‌. ‘వేవ్స్‌’లో భాగంగా శనివారం ఆయన తన సుదీర్ఘ నటనా జీవితం నుంచి కొత్తవాళ్ళకు పనికొచ్చే పలు సూచనలు చె΄్పారు. 
‘‘నాకు జ్ఞాపకశక్తి తక్కువ. అందుకే, చేతితో డైలాగులు రాసుకుంటా.

కష్టమైన సీన్లు ముందుగా చేస్తా. డైలాగులు కంఠస్థం చేస్తా. డైలాగులు నోటికి వచ్చాక, వాటిని నాదైన పద్ధతిలో సొంతం చేసుకుంటా. అదే డైలాగును వల్లె వేస్తున్నప్పుడు దాన్ని అనేక విధాలుగా ఎలా చేయవచ్చో మనకే అర్థమవుతుంది’’ అని ఆమిర్‌ వివరించారు. ‘‘చేస్తున్న పనిలో ఎంత నిజాయతీగా ఉంటే, అంత బాగా నటించగలుగుతాం. సీన్లుప్రాక్టీస్‌ చేసేటప్పుడు నేను అద్దంలో చూస్తూ చేయను. నటించే ముందు ఆ సన్నివేశాన్ని మనసులో ఊహించుకుంటా’’ అని చె΄్పారు. ‘‘సన్నివేశం డిమాండ్‌ చేసింది చేయాలే తప్ప, అందులో నా వంతు ఏమిటి, నాకెంత పేరొస్తుందని చూస్తే దెబ్బతింటాం’’ అని విశ్లేషించారు.

70 కోట్ల మంది చూస్తున్నారు!
గత పాతిక ఏళ్ళ పైచిలుకు కాలంలో భారత మీడియా సాధించిన పురోగతి, మరీ ముఖ్యంగా వీడియో కంటెంట్‌ సృష్టి, ఆ కంటెంట్‌ను జనం చూడడం పెరిగిన తీరు అనూహ్యమని మీడియా నిపుణుడు, జియో స్టార్‌ వైస్‌ఛైర్మన్‌ ఉదయ్‌ శంకర్‌ విశ్లేషించారు. ఒకప్పుడు టీవీకే పరిమితమైతే... ఇప్పుడు 4జీ విప్లవం, హాట్‌స్టార్‌ సహా వివిధ వేదికల ఆవిర్భావంతో దాదాపు 70 కోట్ల మంది స్ట్రీమింగ్‌ కంటెంట్‌ చూస్తున్నారని అంచనా వేశారు.

‘వేవ్స్‌’లో ఆయన మాట్లాడుతూ, ‘‘హిందీ సినిమా ఇప్పటికీ పాతకాలంలోనే ఆగిపోవడం వల్ల థియేటర్లలో వసూళ్ళు తగ్గాయనీ, తమిళ – తెలుగు సహా దక్షిణాది సినీ పరిశ్రమల్లో సృజనాత్మక ప్రయోగాలు, వాటితో పాటు వసూళ్ళు పెరిగాయనీ గుర్తు చేశారు. ‘‘అన్ని తెరలూ ఒకటే కావు. వెండితెర, బుల్లితెర, డిజిటల్‌ ... దేనికవే భిన్నమైనవి. ఒక్కోటీ ఒక్కో పరిణామ దశలో ఉన్నాయి. దేని ప్రయోజనం దానిదే. అది తెలుసుకోకుండా అన్నిటితో ఒకేలా వ్యవహరిస్తే వ్యాపారంలో దెబ్బ 
తింటాం’’ అని ఆయన వివరించారు.

నాగపూర్‌లో ప్రపంచపు అతి పెద్ద స్క్రీన్‌
‘‘ఇండియన్‌ ఎంటర్‌టైన్మెంట్‌ని ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్లాలన్నది ప్రధాని మోదీగారి లక్ష్యం. ఈ దిశలో వరల్డ్స్‌ బిగ్గెస్ట్‌ సినిమా స్క్రీన్‌ నిర్మించే అవకాశం మాకు దక్కడం గర్వకారణం. మా విజన్‌ని అర్థం చేసుకుని, నమ్మిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌గారికి కృతజ్ఞతలు’’ అని అభిషేక్‌ అగర్వాల్‌ అన్నారు. నాగపూర్‌లో వరల్డ్స్‌ బిగ్గెస్ట్‌ సినిమా స్క్రీన్‌ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేయనున్నట్లు ‘వేవ్స్‌–2025’ వేదికగా నిర్మాతలు అభిషేక్‌ అగర్వాల్, విక్రమ్‌ రెడ్డి పేర్కొన్నారు. ‘‘గొప్ప సినిమాలు తీయడమే కాదు, అద్భుతమైన థియేటర్లు నిర్మించాలన్నది మా ధ్యేయం. సినిమాను మరింత గొప్పగా మార్చడమే మా యూవీ క్రియేషన్స్ లక్ష్యం. ప్రపంచపు అతిపెద్ద స్క్రీన్ ని నాగపూర్‌లో నిర్మించ నున్నాం. మా సామర్థ్యాలపై నమ్మకం ఉంచిన మోదీగారికి కృతజ్ఞతలు’’ అన్నారు విక్రమ్‌ రెడ్డి. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement