సూర్య 'కరుప్పు'(తెలుగులో వీరభద్రుడు) బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. తమిళ, తెలుగులో అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. మరోవైపు మోహన్ లాల్ 'దృశ్యం 3' ఎలాంటి ప్రచారం లేకుండానే మన థియేటర్లలోకి వచ్చి మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. అయితే ఈ రెండింటికి తెలుగులో ఏమంత గొప్ప టాక్ రాలేదు. కానీ ఆ ప్రభావం కలెక్షన్స్పై అస్సలు పడినట్లు కనిపించడం లేదు. అదే టైంలో వీటితో పాటు రిలీజైన తెలుగు మూవీస్ని ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. అసలు ఎందుకీ పరిస్థితి?
(ఇదీ చదవండి: హైదరాబాద్లో డ్రీమ్ హౌస్ కడుతున్న ప్రభాస్)
టాలీవుడ్ బాక్సాఫీస్కి సంక్రాంతి ఎంత ముఖ్యమో అంతకు మించి వేసవిలో సందడి ఉంటుంది. కానీ ఈ సమ్మర్ని తెలుగు దర్శకనిర్మాతలు హీరోలు వృథాగా వదిలేశారు. చెప్పుకోదగ్గ ఒక్క సినిమాని కూడా రిలీజ్ చేయలేదు. దీంతో థియేటర్లన్నీ బోసిపోయాయి. ఎండలు, ఐపీఎల్ వల్ల జనాలు థియేటర్లకు రావట్లేదని ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటున్నారు గానీ అసలు కారణం ఇది కాదు. ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేసే కంటెంట్తో ఒక్కరూ మూవీస్ చేయట్లేదు. రొటీన్ రొట్టకొట్టుడు కంటెంట్ వల్ల చిన్న, మిడ్ రేంజ్ మూవీస్ వచ్చినవి వచ్చినట్లే వెళ్లిపోతున్నాయి.
అలా స్టార్స్ సినిమాల కోసం ముఖం వాచిపోయిన తెలుగు ప్రేక్షకులకు.. సూర్య, మోహన్ లాల్ మూవీస్ మండవేసవిలో కూలింగ్ వాటర్లా కనిపించాయి. అంత ఎండలో వాటర్ బాగోలేదని చెప్పినా ఎవరూ పట్టించుకోరు. అలానే ఈ రెండు చిత్రాలు ఏమంత పెద్దగా గొప్పగా లేవు అని ఆడియెన్స్కి తెలిసినా సరే చూసేద్దాంలే అని వెళ్తున్నారు. సూర్య చిత్రానికి బీ,సీ సెంటర్లలో రెండో వారం కూడా ఆదరణ లభిస్తుండగా.. మోహన్ లాల్ చిత్రం మల్టీప్లెక్స్ల్లో జోరు చూపిస్తోంది. దీన్ని క్యాష్ చేసుకోలేకపోయిన తెలుగు దర్శకనిర్మాతలు పదుల కోట్ల రూపాయల వసూళ్లని చేజేతులా వదిలేసుకున్నారు.
ఉన్నంతలో తెలుగు ఆడియెన్స్ కోసం వేసవి చివరలో వస్తున్న పెద్ద సినిమా 'పెద్ది'నే. ప్రస్తుతానికైతే దీనిపై బజ్ బాగానే ఉంది కానీ ఇండస్ట్రీలో పరిస్థితులే బాగోలేవు. ఈ మూవీకి కచ్చితంగా పర్సంటేజీ ఇచ్చి తీరాలని తెలంగాణ ఎగ్జిబిటర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు కూడా తగ్గడం లేదు. దీనికి పరిష్కారం ఎప్పుడు దొరుకుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇలా టాలీవుడ్లోని అంతర్గత సమస్యలు కూడా డబ్బింగ్లకు ఓ రకంగా ప్లస్ అవుతున్నాయి. మరి ఈ విషయం తెలుగు హీరోలు దర్శకులు నిర్మాతలకు ఎప్పుడు అర్థమవుతుందో?
(ఇదీ చదవండి: ఒకప్పటి హీరోయిన్ రంభ ఇంట్లో విషాదం)


