
– పోలీసులకు ఫిర్యాదు
బంజారాహిల్స్: ప్రముఖ నటుడు ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ సినిమా టీజర్ విజువల్స్ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ డబ్బింగ్ స్టూడియో ఇన్చార్జి బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..
బంజారాహిల్స్ రోడ్డునెంబర్–3లోని సాగర్ సొసైటీలో ఉన్న వారాహి స్టూడియోలో రాజాసాబ్ సినిమాకు సంబంధించి విజువల్స్ భద్రపరిచారు. అయితే ఈ నెల 11వ తేదీన గుర్తుతెలియని వ్యక్తులు స్టూడియోలోకి ప్రవేశించి ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విజువల్స్ను చోరీ చేశారని, 13వ తేదీన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని డబ్బింగ్ ఇన్చార్జి ఎన్.వసంత్కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను ఫేస్బుక్లో శంకర్బాయి, కార్తీక్ ప్రభాస్ పేరుతో, ఇన్స్టాలో ప్రభాస్ ఆర్మీ ఫ్యాన్ పేరుతో పోస్ట్ చేశారని, తాము అధికారికంగా విడుదల చేయాల్సిన టీజర్కు ముందే చోరీ చేసిన ఈ టీజర్ విజువల్స్ను పోస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. ఫుటేజీలు పరిశీలించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేపట్టారు.