
పవన్ కల్యాణ్ ఓజీ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం సైతం ధరలు పెంచుకునేందుకు అనుమతులిచ్చింది. ఈ మేరకు ప్రత్యేక జీవోనూ విడుదల చేసింది. అంతేకాకుండా ఈనెల 24న రాత్రి ప్రీమియర్ షోలకు అనుమతులు జారీ చేసింది. ప్రీమియర్ షోలకు ఒక్కో టికెట్ ధర రూ.800 గా నిర్ణయించారు. ఈ మూవీ రిలీజ్ రోజు అంటే సెప్టెంబర్ 25 నుంచి అక్టోబరు 4 వరకు టికెట్ ధరల పెంచుకోవచ్చని అవకాశం కల్పించింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్లో రూ.100, మల్టీప్లెక్స్ల్లో రూ.150 అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చారు. దాదాపు పది రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి.
ఏపీలో భారీగా పెంపు..
పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న ఓజీ సినిమా టికెట్ ధరలను భారీగా పెంచేశారు. ఏపీలో ఏకంగా బెనిఫిట్ షో టికెట్ ధరలను రూ.1000 రూపాయలు వసూలు చేసుకునేందుకు అనుమతులిచ్చారు. అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్పై రూ.125 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మల్టీప్లెక్స్ల్లో ఒక్కో టికెట్పై రూ.150 పెంపునకు అనుమతులు జారీ చేశారు. సినిమా రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు ఈ టికెట్ ధరలను పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో లేని బెనిఫిట్ షోలకు ఇప్పుడు అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.