దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, షెరాజ్ మెహదీ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా తెరకెక్కించిన ఈ మూవీ జనవరి 2న రాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.
షెరాజ్ మెహదీ మాట్లాడుతూ .. ‘‘ఓ అందాల రాక్షసి’ మూవీని జనవరి 2న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాను. కొత్త ఏడాదిలో ఓ మంచి సినిమా వస్తుంది. ఈ మూవీలో కృతి వర్మ, విహాన్షి హెగ్డే, నేహా దేశ్ పాండే, అఖిల, గీతా రెడ్డి, స్నేహా, ప్రియా దేశ్ పాల్, సుమన్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ ఇలా చాలా మంది అద్భుతమైన పాత్రల్ని పోషించారు. మంచి కంటెంట్తో రాబోతోన్న ఈ సినిమా ఆడియెన్స్కి ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. సందేశాత్మక కథతో ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇందులోని ట్విస్ట్లు అద్భుతంగా ఉంటాయి. అమ్మాయిలకు నచ్చే చిత్రం అవుతుంది’ అని అన్నారు.
కథ, మాటల రచయిత భాష్య శ్రీ మాట్లాడుతూ .. ‘‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు కథను, మాటల్ని రాశాను. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓ మంచి ఫీల్తో బయటకు వస్తారు. నేటి తరం ఆడపిల్లలు ఎలా ఉండాలనే కాన్సెప్ట్తో ఈ మూవీని చేశాం. మా హీరో షెరాజ్ అద్భుతంగా నటించారు. డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, హీరోగా ఇందులో మ్యాజిక్ చేశారు. కృతి వర్మ హిందీలో చాలా ఫేమస్. విహాన్షి చాలా అద్భుతంగా నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. జనవరి 2న ఈ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.


