'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ తీసిన కొత్త సినిమా 'ఫంకీ' థియేటర్లలోకి వచ్చేసింది. విశ్వక్ సేన్, కాయదు లోహర్ హీరోహీరోయిన్లు కాగా నాగవంశీ నిర్మించాడు. విడుదలకు ముందు కాస్త బజ్ ఉంది. అలానే రిలీజైంది. కానీ తొలి షో నుంచే మిక్స్డ్, నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. కామెడీ అంతగా పండలేదని, స్టోరీ కూడా ఏం లేదని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ దీని గురించి ఏమంత పాజిటివ్గా మాట్లాడట్లేదు. ఈ క్రమంలోనే బ్లాక్బస్టర్ ప్రెస్మీట్ పెట్టగా.. నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ విచిత్రంగా అనిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: చిరంజీవి 'విశ్వంభర' ఏమైపోయినట్టు?)
'రివ్యూయర్లకి నచ్చదు అని నాకు ముందే తెలుసు. కానీ సాధారణ ప్రేక్షకులు కూడా ఎడిటింగ్ సరిగ్గా లేదని అంటున్నారు. మేము కావాలనే అలా తీసాం. ఎడిటింగ్ సమస్య కాదది. నేను సాగర సంగమం తీసా అని చెప్పానా? ముందే చెప్పాగా సినిమా సీన్ నుంచి సీన్ ఫ్లో లేకుండా ఉంటుందని. మీరేదో సైంటిస్ట్లా కొత్తగా కనిపెట్టినట్టు మాట్లాడతారు ఏంటి? నేను అన్నీ ముందే చెప్పా. సినిమాకు కావాల్సిన గ్లామర్ అయితే లేదు. అది తెలిసే సినిమా తీశాం'.. ఇలా సాగాయి నాగవంశీ మాటలు.
పైన స్పీచ్లో ఎక్కడా కూడా ఆడియెన్స్కి నచ్చేలా సినిమా తీశాం అనే మాట వినబడలేదు. నవ్వించాలనే ఉద్దేశంతో మాత్రమే తీశానని నాగవంశీ అంటున్నారు. కానీ కొన్నిచోట్ల తప్పితే ప్రేక్షకులు.. మూవీలో సీన్లకు అనుకున్నంతగా నవ్వట్లేదనే విషయాన్ని మాత్రం ఇంకా ఒప్పుకోలేకపోతున్నారా అనిపిస్తుంది. గత కొన్నాళ్ల నుంచి చూసుకుంటే యావరేజ్ వచ్చిన మూవీస్ పరిస్థితే థియేటర్ల దగ్గర అంతంత మాత్రంగా ఉంది. అలాంటిది కాస్త నెగిటివ్ టాక్ కూడా వినబడుతున్న 'ఫంకీ'.. వీకెండ్ అయ్యేసరికి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: ‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)


