
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు సర్వసాధారణం. నటీనటుల మధ్య స్నేహం ఏర్పడడం.. అదికాస్త ప్రేమగా మారి చివరకు మూడు మూళ్ల బంధంలో ఒక్కటైపోతుంటారు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో బాలీవుడ్ నటుడు పరేష్ రావల్-నటి స్వరూప్ సంపత్ జంట ఒకటి. బాలీవుడ్లో ఒక ఐకానిక్ జంటగా గుర్తింపు పొందిన పరేష్-స్వరూప్ సంపత్ ప్రేమ కథ సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదు. ఒకరికోసం ఒకరు దాదాపు 12 ఏళ్లు ఎదురుచూసి పెళ్లి చేసుకున్నారట.
అలా ప్రేమలో..
హిందీలోనే కాదు తెలుగులోనూ పరిచయం అక్కర్లేని పేరు పరేష్ రావల్ . 'హేరా ఫేరీ', 'ఓఎమ్జీ', 'సర్దార్', ‘హంగామా’తదితర చిత్రాలతో బాలీవుడ్ని ఆకట్టుకున్న పరేష్.. మనీ, క్షణ క్షణం, శంకర్ దాదా ఎంబిబిఎస్( లింగం మామ పాత్ర), రిక్షావోడు, గోవిందా గోవిందా తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసునూ దోచుకున్నాడు. ఈ విలక్షణ నటుడు నాటక రంగం నుంచే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడనే సంగతి అందరికి తెలిసిందే.
నాటకాలు వేస్తున్న సమయంలోనే స్వరూప్ సంపత్తో ప్రేమలో పడ్డాడట. 1970లలో ముంబైలో జరిగిన ఇండియన్ నేషనల్ థియేటర్ ఫెస్టివల్లో నాటకం ప్రదర్శించేందుకు పరేష్ తన కాలేజీ స్నేహితులతో కలిసి వెళ్లాడు. అదే సమయంలో అక్కడి స్వరూప్ వచ్చింది. అప్పుడే స్కూలింగ్ అయిపోయిన స్వరూప్.. చేతిలో ఈవెంట్కి సంబంధించిన పత్రాలను పట్టుకొని బయట నిలబడి ఉందట. ఆమెను చూడగానే ప్రేమలో పడిపోయాడు పరేష్. ఆమె అందానికి ముగ్థుడైపోయి.. స్నేహితుడి మహేద్రతో .. ‘నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను’ అని స్వరూప్ని చూపించాడట.
ఆమె గురించి ఆరా తీస్తే.. వారి బాస్ కూతురే అని తెలిసింది. ‘చీఫ్ ప్రొడ్యూసర్ కూతురినే ప్రేమిస్తావా?’ అని మహేద్ర నన్ను బెదిరించాడు. ‘ఎవరి కూతురు అయినా సరే.. నేను మాత్రం ఆమెనే పెళ్లి చేసుకుంటా’ అని అప్పేడే వాడికి చెప్పేశా’అని పరేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
12 ఏళ్లు ఎదురుచూసి..
పరేష్ నటనకు ఫిదా అయిన స్వరూప్.. అతనితో స్నేహం చేసింది. పరేష్ మాత్రం ఆమెతో తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. కొన్ని నెలల తర్వాత తన ప్రేమ విషయాన్ని ఆమెతో చెప్పాడు. ‘స్వరూప్కి సింపుల్గా ప్రపోజ్ చేశా. ఆమెతో 3-4 నెలలు స్నేహం చేసిన తర్వాత ఒక రోజు నా ప్రేమ విషయాన్ని చెప్పేశాను. ‘నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒకరినొకరం తెలుసుకుందాం అని చెప్పకు. ఇద్దరం కలిసి జీవిస్తూ తెలుసుకుందాం’ అని చెప్పాను’ అని ఓ ఇంటర్వ్యూలో పరేష్ తన ప్రేమ విషయాన్ని పంచుకున్నాడు.
అయితే వీరిద్దరు ప్రపోజ్ చేసుకున్న 12 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారట. అప్పుడప్పడే పరేష్ ఇండస్ట్రీలోకి వెళ్లడం.. కెరీర్ పరంగా సెట్ అయ్యాకనే పెళ్లి చేసుకోవాలకున్నాడట. ఈ విషయం స్వరూప్తో చెబితే.. ఆమె కూడా అర్థం చేసుకొని 12 ఏళ్ల పాటు ఎదురు చూసి 1987లో వివాహ బంధంలో ఒక్కటయ్యారు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వరూప్ విషయానికొస్తే.. 1979లో మిస్ ఇండియా విజేతగా నిలిచింది. బాలీవుడ్లో 'నరం గరం' (1981), 'సాగర్' (1985) వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.