ఆ దర్శకుడికి ఆగ్రహం కలిగించిన చిత్రం

Director Vignesh Shivan Fires On Kadambari Movie - Sakshi

చెన్నై: కాదంబరి చిత్రం ప్రముఖ దర్శకుడికి ఆగ్రహాన్ని కలిగించిందట. నవ దర్శకుడు అరుళ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, కథానాయకుడిగా నటించిన చిత్రం కాదంబరి. ఇందులో కాసీమా రఫీ, అఖిలా నారాయణన్, సర్జున్, నిమ్మీ, పూజిత, సౌమ్య, మహారాజ్, మురుగానందం తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇంతకు ముందు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో నయనతార నటించిన నానుమ్‌ రౌడీదాన్‌ చిత్రంలో ఆమె పాత్ర పేరును కాదంబరిని టైటిల్‌ గా పెట్టి ఈ చిత్రాన్ని  తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ఇది పూర్తిగా హారర్‌ నేపథ్యంలో రూపొందుతున్న కథా చిత్రమని తెలిపారు. ఆంధ్రా అటవీ ప్రాంతంలోని ఒక ఇంట్లో జరిగే ఇతివృత్తంగా కాదంబరి చిత్రం ఉంటుందని చెప్పారు. (చదవండి : అడవుల్లో హ్యాపీగా..!)

దీన్ని తక్కువ బడ్జెట్‌లో పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఇంతకు ముందు వచ్చిన దెయ్యం కథా చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని అన్నారు. కాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు విడుదల చేయడానికి ముందుకు వచ్చారని చెప్పారు. అలా నటి పార్వతీ నాయర్, డేనియల్‌ బాలాజీ, సంగీత దర్శకుడు సంతోషం దయానిధి, నిర్మాత ధనుంజయన్‌ తదితరులు ఈ చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారని తెలిపారు. కాగా దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ను కూడా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయమని కోరగా ఆయన చిత్రం పేరు వినగానే మండిపడినట్లు సమాచారం. అందుకు కారణం విఘ్నేష్‌ శివన్‌ కాదంబరి పేరుతో నానుమ్‌ రౌడీదాన్‌ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకోవడమేనని తెలుస్తోంది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top