తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్.. ముంబైకి షిఫ్ట్ కాబోతున్నాడనే రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన తండ్రి అల్లు అరవింద్.. షూటింగ్ కోసం ముంబైలో ఎక్కువగా ఉంటున్నందున అలా అనిపించి ఉండొచ్చని, అతడికి ఇక్కడే సొంతిల్లు ఉంది. పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. స్నేహితులందరూ హైదరాబాద్లోనే ఉన్నారు. అలాంటప్పుడు ముంబైకి ఎందుకు వెళ్తాడు? అక్కడ స్థిరపడాలనే ఆలోచన లేదు అని స్పష్టం చేశారు.
(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు బోల్డ్ కామెడీ సినిమా)
అయితే ముంబైకి బన్నీ పూర్తిగా షిఫ్ట్ కాకపోయినప్పటికీ కొన్నాళ్ల పాటు అయితే అక్కడ ఉండబోతున్నాడు. ఈ విషయం మాత్రం నిజమే. ఎందుకంటే రీసెంట్గానే ముంబైలోని జుహూ ప్రాంతంలో తార రోడ్లో ఐదు బెడ్ రూమ్ల(5 BHK) లగ్జరీ అపార్ట్మెంట్ని బన్నీ అద్దెకు తీసుకున్నాడు. ఏడాది క్రితమే ఈ డీల్ ఫిక్సయినప్పటికీ తమ అభిరుచికి తగ్గట్లు బన్నీ-స్నేహ దాని ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకున్నారట.
సముద్రానికి ఎదురుగా ఉండే ఈ అపార్ట్మెంట్కి నెలవారీ అద్దె ఏకంగా రూ.16 లక్షలు అని, ఇందులో రాబోయే మూడేళ్ల పాటు అల్లు అర్జున్ ఉండబోతున్నాడని సమాచారం. స్కూల్ సెలవులు ఇచ్చిన టైంలో భార్య స్నేహారెడ్డితో పాటు పిల్లలు అయాన్, అర్హ అక్కడికి వెళ్తారు. 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిలో స్విమ్మింగ్ పూల్, పార్కింగ్ తదితర సౌకర్యాలు ఉన్నాయి.
అల్లు అర్జున్ చేతిలో ప్రస్తుతం అట్లీ తీస్తున్న 'రాకా' మూవీ ఉంది. దీని షూటింగ్ చాలావరకు ముంబైలోనే ఉండనుంది. దీని తర్వాత లోకేశ్ కనగరాజ్తో చేయబోయే సినిమా చిత్రీకరణ కూడా అక్కడే జరగనున్న నేపథ్యంలో రాబోయే మూడేళ్ల పాటు బన్నీ ముంబైలో ఉండబోతున్నాడట.
(ఇదీ చదవండి: ఇప్పటికీ మా కుటుంబాన్ని గుడిలోకి రానివ్వరు: నటుడు వినోద్)


