మూగజీవాన్ని రక్షించిన హీరో, రేణూ ప్రశంస | Sakshi
Sakshi News home page

పిల్లిని కాపాడిన హీరో, పెంచుకుంటానంటున్న రేణూ

Published Mon, Feb 1 2021 2:35 PM

Adivi Sesh Rescues Kitten, Renu Desai Agrees To Foster It - Sakshi

‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి విలక్షణమైన హిట్‌ చిత్రాల్లో నటించి, హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్‌. అయితే అతడు చేసిన ఓ మంచిపనికి నటి రేణు దేశాయ్‌ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇంతకీ అడివి శేష్‌ ఏం చేశాడో తెలుసుకునేందుకు ఇది చదివేయండి..

హీరో అడివిశేష్‌ ఆదివారం రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఓ వీధిలో పిల్లికూన కనబడింది. తీవ్రమైన ట్రాఫిక్‌తో అది బెంబేలిత్తిపోయి ఉంది. సుమారు నాలుగైదు వారాల వయసున్న దానికి సమీపంలో తల్లి కూడా తారసపడలేదు. దీంతో అడివి శేష్‌ దాని తల్లిని వెతికి చూశారు, కానీ అదెక్కడా కనిపించలేదు. వెంటనే భయంతో బిగుసుకుపోయిన దానిని చేతుల్లోకి తీసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. సినిమాటోగ్రాఫర్‌ షనైల్‌డియో ఇందుకు సహకరించాడు. అయితే దాన్ని ఎవరికి అప్పజెప్పితే బాగుంటుందా? అని ఆలోచించగానే వెంటనే రేణు దేశాయ్‌ గుర్తొచ్చింది. ఇంకేముందీ దీన్ని పెంచుకోమని అతడు రేణూకు చెప్పడం, పిల్లులని ప్రేమగా చూసుకునే ఆమె అతడు చేసిన మంచిపనిని మెచ్చుకుంటూనే పెంచుకునేందుకు ఓకే చెప్పేయడం చకాచకా జరిగిపోయాయి. ఈ స్టోరీనంతా హీరో అడివి శేష్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ముద్దొస్తున్న పిల్లికూన ఫొటోను సైతం షేర్‌ చేశాడు. (చదవండి: ఆ రోజు ‘మేజర్‌’ డే అంటున్న మహేష్‌)

ఇదిలా వుంటే ప్రస్తుతం అడివి శేష్‌ మేజర్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ప్యాన్‌ ఇండియా చిత్రం మేజర్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఆర్మీ ఆఫీసర్‌ సందీప్‌ ఉన్నికష్ణన్‌ జర్నీని, ఆయన జీవన శైలిని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శశికిరణ్‌ తిక్క. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సహకారంతో సోనీ పిక్చర్స్‌ ఇండియా నిర్మిస్తోంది. శోభితా దూళిపాళ్ల, ప్రకాశ్‌ రాజ్, సయీ మంజ్రేకర్, రేవతి, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. (చదవండి: సర్కారు వారి పాటలో మోనాల్‌ గజ్జర్‌!)

Advertisement
Advertisement