నేటి నుంచే ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’
మెదక్ కలెక్టరేట్: తప్పుల్లేని ఓటరు జాబితా లక్ష్యంగా కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే జిల్లాలో 88.77 శాతం ఓటరు మ్యాపింగ్ పూర్తి కాగా, ఓటరు జాబితా సవరణను సమర్థవంతంగా నిర్వహించేందుకు బీఎల్ఓలకు శిక్షణ సైతం ఇచ్చారు. వారు జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని 21 మండలాల్లో జూలై 24 వరకు పర్యటించి ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. ఇందుకోసం మొత్తం 666 మంది పనిచేయను న్నారు. ఇందులో 586 మంది బీఎల్ఓలు (బూత్ లెవల్ అధికారులు), 16 మంది ఏఈఆర్టీలు, 64 మంది బీఎల్ఓ సూపర్వైజర్లు ఉన్నారు.
పౌరులంతా భాగస్వాములు కావాలి
తప్పుల్లేని ఓటరు జాబితా తయారీలో పౌరులంతా భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలో 2కే రన్ను ప్రారంభించి మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితా ఖచ్చితత్వంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమం నేటి నుంచి జిల్లాలో ప్రారంభమవుతుందని, ఇందులో ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఓటరు జాబితాలో నమోదు చేసుకున్న వారు తమ పేర్లను వెబ్సైట్లో తనిఖీ చేసుకోవచ్చని సూచించారు. అవసరమైతే సవరణలు, మా ర్పులు, చేర్పుల కోసం బూత్ లెవెల్ అధికారుల ను సంప్రదించాలన్నారు. అనంతరం జిల్లాను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సెల్ఫీ పాయింట్లో కలెక్టర్, అదనపు ఎస్పీ, డీఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బీఎల్ఓల ఇంటింటి సర్వే
జిల్లాలో 666 మంది నియామకం


