7వ జోన్ డీఐజీ చౌహాన్
జహీరాబాద్: రాష్ట్ర సరిహద్దు వద్ద పోలీస్ చెక్పోస్టులను పకడ్బందీగా నిర్వహిస్తూ అక్రమ రవాణాకు వీలు లేకుండా చూడాలని 7వ జోన్ డీఐజీ ఎల్.ఎస్ చౌహాన్ పోలీసులను ఆదేశించారు. బుధవారం ఆయన జహీరాబాద్లోని డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పట్టణం రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా పక్క రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరిగే అవకాశం ఉందన్నారు. అలాగే అధిక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. బ్లాక్ స్పాట్ల వద్ద సీసీ కెమెరాల నిఘాను కట్టుదిట్టం చేయాలన్నారు. నేరాలను నియంత్రించడానికి ఎప్పటికప్పుడు సబ్ డివిజన్ అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మిస్సింగ్, ఎన్బీడబ్ల్యూ కేసుల చేధనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, సీఐ శివలింగం, ఆయా పోలీస్స్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


