ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
రామాయంపేట(మెదక్): బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో రాష్ట్రం అప్పులపాలైందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆరోపించారు. బుధవారం మండలంలోని కాట్రియాలలో ఇందిరమ్మ ఇళ్లు, పర్వతాపూర్లో పాఠశాల ప్రహారీ పనులు ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ప్రభుత్వ నిధులతో పాటు తన సొంత నిధులను వెచ్చిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు ఇళ్లు మంజూరు చేస్తామని మోసగించిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే తన సొంత నిధులతో రెండు గ్రామాల్లో బోరు మోటార్లను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్లు కొత్త స్రవంతి, తార్యానాయక్, ఉప సర్పంచ్లు బాబూనాయక్, ఈశ్వర్, పార్టీ మండలశాఖ అధ్యక్షుడు మహేందర్రెడ్డి, కౌన్సిలర్ నాగరాజు, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రామకిష్టయ్య, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నగేశ్, జిల్లా నాయకులు నాగులు, రమేశ్చారి, ఎల్లం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


