అల్లాదుర్గం(మెదక్): ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఐకేపీ అధికారులు, సిబ్బందికి చేతివాటంగా తయారయ్యాయి. తూకం వేయగానే రైతులకు కొనుగోలు రసీదు ఇవ్వాలి. కానీ తెల్ల కాగితంపై రాసి ఇచ్చారు. రైస్ మిల్లుకు ధాన్యం పంపిన తర్వాత తూకంలో మోసం చేయడంతో అలాదుర్గంలో సోమవారం రైతులు ఐకేపీ సిబ్బందిని నిలదీశారు. ధాన్యం కొనుగోలు అక్రమాల్లో కిందిస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పెద్దఎత్తున ముడుపులు ముట్టాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు రైతుల ధాన్యం మ్యాచర్ రాకుంటే 42 కిలోలకు బదులు 44 కిలోల తూకం వేసి 42 కిలోలకే డబ్బులు చెల్లించినట్లు తెలిసింది. మ్యాచర్ వచ్చిన ధాన్యం, రానివి ఒకే లారీలో పంపడంతో మిల్లర్లు మ్యాచర్ లేదని 44 కిలోల 600కు తూకం చేసుకున్నారని రైతులు వాపోయారు. ఒక్కో లారీకి రైతుల నుంచి రూ. 20 వేల పైనే దోపిడీకి పాల్పడినట్లు ఆరోపించారు. కలెక్టర్ పూర్తిస్థాయి విచారణ చేపడితే అక్రమాలు బయటపడతాయని చెబుతున్నారు.


