మెదక్ కలెక్టరేట్: మెదక్ మున్సిపల్ సాధారణ సర్వ సభ్య సమావేశం సోమవారం కమిషనర్ శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రోహిత్రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా కౌన్సిలర్లు పట్టణంలో నెల కొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా తాగునీరు, శానిటేషన్, కోతులు, కుక్కలు, అంతర్గత సీసీ రోడ్లు, ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ పేరిట రూ. కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు. తమ సొంత నిధులతో బోర్లు వేయించామన్నారు. పార్టీల పేరుతో రాజకీయాలు చేయడం లేదన్నారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామన్నారు. పట్టణ ప్రజలపై అడ్డగోలుగా పన్నుల భారం మోపితే సహించేది లేదని కమిషనర్ను హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. 70 శాతం నూతన కౌన్సిలర్లు ఉన్నందున వారికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి కోసం తాను ముందుంటానని, ఎలాంటి అవసరం ఉన్న తనకు ఫోన్ చేయాలని సభ్యులకు సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా పట్టణాభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. పట్టణంలో నెలకొన్న తాగునీరు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించుకుందామని తెలిపారు. వైస్ చైర్మన్ దొంతి నరేష్గౌడ్ మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అన్ని వార్డుల్లో పర్యటిస్తున్నామన్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు చేపడుతామని వివరించారు.
మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో
ఎమ్మెల్యే రోహిత్రావు


