నర్సాపూర్: నర్సాపూర్లోని ప్రభుత్వ మైనార్టీ పాఠశాల, కాలేజీలో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 11 మంది విద్యార్థులు డీహైడ్రేషన్కు గురయ్యారని, వారికి ప్రిన్సిపాల్ నసీమా షేక్తో పాటు సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సకాలంలో వైద్యం చేయించారన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు. వంటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
పేదలకు మెరుగైన వైద్యం
చేగుంట(తూప్రాన్): పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డీఎంహెచ్ఓ శ్రీరామ్ అన్నారు. సోమవారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగాహెల్త్ క్యాంపు నిర్వహించి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా క్యాంపును డీఎంహెచ్ఓ సందర్శించి మాట్లాడారు. 205 మందికి వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు. 57 మందిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట వైద్యులు అనిల్కుమార్, అరుణ, శిరీష, శారద, కిరణ్, అక్షయ్తో పాటు సిబ్బంది ఉన్నారు.
‘నిర్భయంగా
ఫిర్యాదు చేయండి’
మెదక్ కలెక్టరేట్: సమస్యలపై ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీస్శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలు ఎలాంటి పైరవీల అవసరం లేకుండా నేరుగా సంప్రదించాలన్నారు. చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమన్నారు.
పరిశుభ్రతే ముఖ్యం
రామాయంపేట(మెదక్): పట్టణ పరిశుభ్రత విషయమై అందరూ సహకరించాలని మున్సి పల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం రామాయంపేటలో 5 కే రన్ను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ నవనీత, కౌన్సిలర్లు నాగరాజు, రంజిత్, స్వప్న, ప్రవీణ్, శంకర్గౌడ్, రవినాయక్, మాధవి, కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు స్వామి తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న
ఇంటర్ పరీక్షలు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని డీఐఈఓ మాధవి తెలిపారు. సోమవారం మొదటి సంవత్సరం ఫిజిక్స్–1, ఎకానమిక్స్–1 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పారు. జనరల్ విభాగంలో 6,401 విద్యార్థులకు గాను 6,198 మంది హాజరు కాగా, ఒకేషనల్ విభాగంలో 621 విద్యార్థులకు గాను 600 మంది పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. దీంతో విద్యార్థుల హాజరు శాతం 96.80 శాతం నమోదైనట్లు వివరించారు. ఐదు నిమిషాల నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులందరూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నట్లు పేర్కొన్నారు.


