ఇక సమరమే..
మెదక్జోన్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. టికెట్ వస్తుందనే ఆశతో ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు వేసిన ఆశావహుల్లో కొంతమందికి నిరాశే మిగిలింది. టికెట్లు రాని వారిని బుజ్జగించి విత్డ్రా చేయించారు. కొందరు ససేమిరా అంటూ ఇతర పార్టీల్లో చేరగా, మరికొందరు రెబల్స్గా బరిలో నిలిచారు. జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, వీటి పరిధిలో 75 వార్డులు ఉన్నాయి. ఈ నాలుగింటిలో 519 మంది ఆశావహులు 668 నామినేషన్లు దాఖలు చేశారు. కాగా ఆఖరి రోజు మంగళవారం నాలుగు మున్సిపాలిటీల్లో 380 మంది విత్డ్రా చేసుకోవటంతో 288 మంది బరిలో నిలిచారు. కాగా మెదక్ మున్సిపాలిటీలోని 32వ వార్డు మాత్రం ఇప్పటికే ఏకగ్రీవం అయింది. మిగిలిన 74 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.
బుజ్జగింపులు
జిల్లాలోని నాలుగు బల్దియాల్లో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు బీజేపీలో సైతం టికెట్ ఆశించి ఎంతో మంది భంగపడ్డారు. ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు నుంచి నలుగురు నామినేషన్లు వేశారు. అయితే సర్వేలో ప్రజల్లో మంచి ఫలితాలు వచ్చిన వారికి మాత్రమే బీఫాంలు ఇచ్చారు. ఇతరులను బజ్జగించి విత్డ్రా చేయించారు. కాగా మెదక్ పట్టణానికి చెందిన రిటైర్డ్ ఎంఈఓ శ్యాంసుందర్ సీనియర్ బీఆర్ఎస్ నేత. పట్టణంలోని 26వ వార్డు నుంచి నామినేషన్ వేశాడు. కాగా ఆయనకు పార్టీ బీఫాం ఇవ్వకపోవడంతో మంగళవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
వార్డుకు ముగ్గురు చొప్పున పోటీ
జిల్లాలో 74 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, వాటిలో అత్యధికంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో మాత్రమే ఎక్కువ వార్డుల్లో పోటీ ఉంది. కొన్ని స్థానాలకు మాత్రమే బీఎస్పీ, ఎంఐఎం, రెబల్స్, స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. వార్డుకు ముగ్గురు చొప్పున పోటీ నిలవగా, కొన్ని వార్డులో నలుగురు నుంచి ఐదుగురు పోటీ చేస్తున్నారు. కాగా మెదక్లో 31 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, బీజేపీ 27 వార్డుల్లో మాత్రమే పోటీలో నిలిచింది.
మున్సిపల్ పోరు.. అభ్యర్థులు ఖరారు
74 వార్డులకు 288 మంది పోటీ
380 మంది
నామినేషన్ల ఉపసంహరణ
బీఫాంలు రాని వారు కొందరు
ఇతర పార్టీల్లోకి..
ఇక సమరమే..


