
సిగాచీకి ప్రొహిబిటెడ్ ఆర్డర్
ప్రాణాలు పోయాక ఆర్డరిచ్చిన పరిశ్రమల శాఖ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సిగాచీ పరిశ్రమ ప్రమాదం జరిగాక ఫ్యాక్టరీల శాఖ మేల్కొంది. ఈ పరిశ్రమలో పేలుడు ఘటన జరిగి 54 మంది కార్మికుల ప్రాణా లు పోయాక ఫ్యాక్టరీల శాఖ అధికారులు ఇప్పుడు ఆ యాజమాన్యానికి ప్రోహిబిటెడ్ ఆర్డర్ను జారీ చేశారు. ఈ పరిశ్రమల్లో కార్మికుల భద్రతా ప్రమా ణాలు పాటించకపోవడంతో ప్రమా దం జరిగిందని, నిబంధనల ప్రకారం ఇక్కడ ఉత్పత్తి కార్యకలాపాలు జరగలేదని, తిరిగి తాము అనుమతిచ్చేంత వరకు ఇందులో ఉత్పత్తి చేయవద్దని ఈ ఆర్డర్లో పేర్కొన్నారు. ఫ్యాక్టరీలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి భద్రత ఏర్పాట్లను పరిశీలించాల్సిన ఈశాఖ అధికారులు ప్రమాదం జరగకముందు ఎందుకు స్పందించలేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
బాధ్యులైన అధికారులపై చర్యలేవి?
ప్రమాదం జరిగిన నెల రోజులు గడిచినా ఇప్పటివరకు బాధ్యులైన ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకోకపోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై శాఖ పరమైన విచారణ కొనసాగుతోందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిశ్రమను ఇప్పటివరకు తనిఖీలు చేసిన అధికారులు భద్రతా లోపాలను గుర్తించారా? గుర్తిస్తే వాటిని సరిచేయాలని పరిశ్రమ యాజమాన్యానికి నోటీసులిచ్చారా? సరి చేయకుండా నిర్లక్ష్యం చేసిన పరిశ్రమ యాజమాన్యాన్ని ప్రమాదం జరిగే వరకు ఎందుకు ఉపేక్షించారు? వంటి అంశాలపై ఆ శాఖ ఇప్పటికీ వెల్లడించడం లేదు.
నిపుణుల కమిటీ నివేదికపై స్పష్టత ఏది?
ప్రమాదం జరిగిన వెంటనే సీఎస్ఐఆర్–ఐఐసీటీ శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు నేతృత్వంలోని నలుగురు నిపుణుల బృందాన్ని నియమించినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చిందా? ఇవ్వలేదా? అనేది తేలలేదు. ఆ నివేదికను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.