
అన్నదాతకు ‘భరోసా’
సకాలంలో పెట్టుబడి సాయం విడుదల చేసిన ప్రభుత్వం
● జిల్లాలో కొత్తగా 6,558 మంది రైతులు
వానాకాలం సీజన్ ప్రారంభంలోనే పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారండబ్బులు విడుదల చేసింది. ఈనెలాఖరులోగా అందరి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు తెలిిపింది. గత యాసంగిలో ఆలస్యంగా రైతు భరోసా ఇవ్వడంతో పెట్టుబడి కోసం అన్నదాతలు ఇబ్బంది పడ్డారు.
– మెదక్జోన్
జిల్లావ్యాప్తంగా 2,96,983 మంది రైతులు ఉండగా, సుమారు 4 లక్షల ఎకరాల సాగు భూములు ఉన్నాయి. వాటిలో ఏటా 3.90 లక్షల ఎకరాల వరకు వివిధ రకాల పంటలను సాగుచేస్తున్నారు. కాగా ఈ వానాకాలం సీజన్లో 3.50 లక్షల ఎక రాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. గత యాసంగి సీజన్లో 2,65,629 మంది రైతులకు ప్రభుత్వం రూ. 213.63 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. గత రబీతో పోల్చుకుంటే జిల్లాలో 6,558 మంది రైతులకు కొత్తగా పట్టాలు వచ్చాయని, వారికి సైతం ఈ సీజన్లో రైతు భరోసా అందిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో వెంచర్లు, గుట్టలు, సాగుకు యోగ్యం కాని భూములకు సైతం రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించారని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఎన్ని ఎకరాలకు పెట్టుబడి సాయం ఇెస్తే బాగుంటుందని గతంలో జిల్లావ్యాప్తంగా రైతులతో సమావేశాలు నిర్వహించింది. దీంతో మెజార్టీ రైతులు 10 ఎకరాల వరకు పెట్టుబడి సాయం ఇవ్వాలని పేర్కొన్నారు. పట్టాలు ఉన్నప్పటికీ సాగుకు యోగ్యం కాని భూములను గుర్తించి వాటికి పెట్టుబడి సాయం నిలిపివేసింది. అలాంటి భూములు జిల్లావ్యాప్తంగా 6,870 ఎకరాలు ఉన్నట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
2.72 లక్షల మంది రైతులకు సాయం
ఈ వానాకాలం సీజన్లో 2,72,187 మంది రైతులకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందనుంది. గత రబీసీజన్లో 2,65,629 మంది రైతులకు గానూ రూ. 213.63 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. కాగా అప్పటితో పోలిస్తే కొత్తగా 6,558 మంది రైతులకు పాస్ పుస్తకాలు వచ్చాయి. దీంతో ఈ సంఖ్య 2.72 లక్షలకు చేరుకుంది. ఇదిలాఉండగా జిల్లావ్యాప్తంగా 2,96,983 మంది రైతులు ఉండగా, రైతు భరోసా అందేది మాత్రం 2,72,187 మందికి మాత్రమే. మిగితా 24,796 మందికి భరోసా లేదు. వీరిలో చాలా మంది భూ స్వాములతో పాటు సాగుకు యోగ్యం కాని భూములు గల రైతులు ఉన్నట్లు తెలిసింది.