
పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు
ఎస్పీ శ్రీనివాస్రావు
పెద్దశంకరంపేట(మెదక్)/అల్లాదుర్గం/రేగోడ్: జిల్లాలో పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ డాక్టర్ శ్రీనివాస్రావు తెలిపారు. సోమవారం పెద్దశంకరంపేట పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పోలీస్ సిబ్బందికి పలు సూచనలిచ్చారు. జాతీయ రహదారి కావడంతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దొంగతనాల నివారణకు గస్తీని పెంచాలని, రహదారి నిబంధనలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం అల్లాదుర్గం, రేగోడ్ పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు. పాత కేసుల వివరాలు, రికార్డులు పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలన్నారు. వాహనాలు తనిఖీ చేస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, ఎస్ఐలు ప్రవీణ్రెడ్డి, శంకర్, సందీప్రెడ్డి సిబ్బంది ఉన్నారు.
సమస్యలపై నేరుగా సంప్రదించండి
మెదక్ మున్సిపాలిటీ: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, నేరుగా వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలపై సంబంధిత పోలీస్స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. చట్టప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.