ఆసిఫాబాద్రూరల్: అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తలు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని భవానినగర్కు చెందిన బానోత్ రాజు(45), సుశీల (40) దంపతులకు ఒక కుమారుడు అనిల్ ఉన్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. అనిల్ కుమార్తె (3) తల్లిదండ్రుల వద్ద నిద్రపోయింది. గురువారం ఉదయం సమయంలో కుమార్తె ఏడుస్తుండగా అనిల్ వచ్చి చూస్తే తల్లిదండ్రులు చనిపోయి ఉన్నారు. ఈవిషయమై పోలీసులకు సమాచారం అందించారు. అయితే, గతేడాది పీర్ల పండుగ సమయంలో రాజు ఇంట్లో ఆభరణాల చోరీ జరిగింది. కేసు నమోదైన పోలీసులు నిందితులను పట్టుకోలేదు. ప్రస్తుతం పీర్ల ఉత్సవాల నేపథ్యంలో గ్రామస్తులు చందాలు వేసి ఆభరణాలు కొనుగోలు చేశారు. తన తండ్రికి సవారీ వస్తుందని గతేడాది చోరీ చేసినవారు ఎవరనేది బయటపడుతుందని ముందస్తు ప్రణాళిక ప్రకారం తల్లిదండ్రులను హత్య చేశారని కుమారుడు అనిల్ ఆరోపించారు. మూడు రోజులుగా అర్ధరాత్రి విద్యుత్ సరఫరా తీసివేశారని, బుధవారం రాత్రి కట్ చేశారని తెలిపారు. కుమారుడు, కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు.


