లోకేశ్వరం: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని పుస్పూర్ గ్రామానికి చెందిన పిల్లికర్ యోగేష్ (24) భైంసా మండలంలోని మాలేగాంలో ఉంటున్న తన మేనమామ సంబాజీ కుమార్తె నవనీత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మార్చి 15న హైదరాబాద్లోని ఎల్లమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నారు. రెండు రోజుల తర్వాత ఇద్దరూ కలిసి పుస్పూర్ గ్రామానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న నవనీత తల్లిదండ్రులు పుస్పూర్కు వచ్చి మీ పెళ్లి వైభవంగా చేస్తామని నమ్మబలికి నవనీతను పుట్టింటికి తీసుకెళ్లారు. ఇటీవల అత్తారింటికి వెళ్లి నవనీతను కాపురానికి రమ్మని కోరడంతో నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఈ నెల 5న ఇంట్లో ఎవరరూలేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు భైంసాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్సకోసం నిజామాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుని సోదరుడు నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


