ఓపెన్కాస్ట్ పనులు అడ్డుకున్న నిర్వాసితులు
కాసిపేట: మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని ఓపెన్కాస్ట్లో చేపట్టిన ఓబీ తరలింపు పనులను మండలంలోని ట్యాంకుబస్తీకి చెందిన భూ నిర్వాసిత బాధితులు సోమవారం అడ్డుకున్నారు. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి శివారులో నష్టపోయిన భూమికి పరిహారం ఇవ్వలేదన్నారు. పరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టడం సరికాదని మండిపడుతూ లారీలు, జేసీబీలు అడ్డుకున్నారు. పనులు చేపట్టిన సింగరేణి అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిహారం అందించి పనులు చేపట్టాలని భీష్మించుకు కూర్చోవడంతో పనులు నిలిపివేశారు. పరిహారం అందించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని నిర్వాసిత బాధితులు హెచ్చరించారు.


