● దరఖాస్తులు ఎక్కువ.. మంజూరు తక్కువ ● ఉమ్మడి జిల్లాలో డ
మంచిర్యాలఅర్బన్: ఆదాయం తక్కువగా ఉన్న ఆలయాల్లో నిత్యం ధూప దీప నైవేద్య పూజలు కొనసాగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ధూప దీప నైవేద్యం(డీడీఎన్) పథకంలో ఉమ్మడి జిల్లాకు శఠగోపం పెట్టింది. వందల సంఖ్యలో దరఖాస్తులు రాగా ఆలయాల ఎంపిక మాత్రం రెండు పదులకు పరిమితం కావడం నిరాశకు గురిచేస్తోంది. మంచిర్యాల జిల్లాలో ఒకే ఆలయానికి చోటు దక్కడంపై పెదవి విరుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఐదు, కుమురంభీం ఆసిఫాబాద్లో రెండు, నిర్మల్ జిల్లాలో 13 ఆలయాలు మంజూరయ్యాయి.
ఆలయాలకు దక్కని చోటు
డీడీఎన్ పథకం కింద ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 726 దరఖాస్తులు వచ్చాయి. పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ అనంతరం 146 ఆలయాలు ఎంపిక చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. ఇందులో 21 ఆలయాలు మాత్రమే ఈ పథకం కింద మంజూరయ్యాయి. ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే ఉమ్మడి జిల్లాకు మొండి చేయి చూపినట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల ప్రజాప్రతినిధుల పైరవీలు, ఒత్తిడితో ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి ప్రజాప్రతినిధుల ఉదాసీనతతో ఆశించిన మేర ఆలయాలకు చోటు దక్కలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిబంధనలు ఇలా..
ఈ పథకం కింద ఆలయాలు ఎంపిక కావాలంటే దేవాదాయ శాఖలో నమోదై నిత్య పూజలు నిర్వహిస్తుండాలి. జాతర సందర్భాల్లో తెరిచే ఆలయాలకు పథకం వర్తించదు. ఆలయానికి ఆదాయం వచ్చే ఎలాంటి భూములు ఉండకూడదు. ఆలయంలో ఒక అర్చకుడికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఒకే ప్రాంగణంలో ఉన్న ఉప ఆలయాలకు వర్తించదు. రాష్ట్రంలో 2007లో తీసుకొచ్చిన ఈ పథకం కింద ఒక్కో గుడికి రూ.2,500 చెల్లించేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచారు. పూజ సామగ్రికి రూ.4వేలు, అర్చకుడికి రూ.6వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తున్నారు. దరఖాస్తుల వడపోత అనంతరం ప్రత్యేక కమిటీ వందల సంఖ్యలో ఎంపిక చేసి నివేదించినా మంజూరు మూడు పదులకై నా చేరకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరిన్ని ఆలయాలకు మంజూరు అవకాశం కల్పించేలా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
మంజూరైన ఆలయాలు ఇవే..
శ్రీరామ సత్యనారాయణస్వామి ఆలయం(దంతన్పల్లి), నల్లపోచమ్మ ఆలయం(ఖా నాపూర్), దత్తాత్రేయ స్వామి ఆలయం(బా దన్కుర్తి), శివపంచాయతన అభయాంజనే య స్వామి ఆలయం(మాసాయిపేట్), అభయాంజనేయస్వామి ఆలయం(ఆదిలాబాద్ టౌన్), వీర హనుమన్ టెంపుల్(కోలిపూర్ ఆదిలాబాద్టౌన్), హనుమాన్ టెంపుల్(జందాపూర్, ఆదిలాబాద్), అడెల్లి పోచమ్మ ఆలయం(సారంగాపూర్), హనుమాన్ టెంపుల్(వాడి భైంసా), వేంకటేశ్వరస్వామి ఆలయం(సోఫీనగర్, నిర్మల్ టౌన్), జగదాంబ సేవాలాల్ ఆలయం(పారపెల్లి తండా, లక్ష్మ ణచాంద), కోదండరామాలయం(కౌట్ల–కే, నిర్మల్), ఆంజనేయస్వామి ఆలయం(నర్సాపూర్–జీ), మార్కండేయ స్వామి ఆలయం(దిలావర్పూర్), పెద్దమ్మ ఆలయం(గోపాల్పేట్, సారంగపూర్), భక్తాంజనేయ స్వామి టెంపుల్(బీబ్రా, దహెగాం), శివాలయం(అయనం, దహెగాం), పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం(తలమడుగు), కోదండ రామాలయం(మాదారం టౌన్షిప్, మంచిర్యాల)కు మంజూరు చేశారు.
జిల్లా దరఖాస్తులు ఎంపిక చేసినవి మంజూరు ఆదిలాబాద్ 219 34 05కుమురంభీం 102 18 02
మంచిర్యాల 110 34 01
నిర్మల్ 295 60 13
మొత్తం 726 146 21
● దరఖాస్తులు ఎక్కువ.. మంజూరు తక్కువ ● ఉమ్మడి జిల్లాలో డ


