
‘పరిషత్’ ఎన్నికల సందడి
● మంత్రి ‘పొంగులేటి’ ప్రకటనతో జోష్
● జిల్లాలో 129 ఎంపీటీసీ, 16 జెడ్పీటీసీ స్థానాలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): పల్లెల్లో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటన ఇటు అధికార పార్టీలో అటు ప్రతిపక్ష పార్టీల్లో జోష్ నింపింది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు. దీంతో ఎన్నికల్లో పోటీకి ఎదురుచూస్తున్న ఆశావహులు పావులు కదుపుతున్నారు.
పూర్తయిన ఏర్పాట్లు
ఇప్పటికే పరిషత్ ఎన్నికల సామగ్రి జిల్లాకు చేరగా.. మండలాల వారీగా సిద్ధం చేసి పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు. పార్టీ గుర్తుపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. గత ఏడాది జూలై 2తో ఎంపీటీసీలు, 3వ తేదీతో జెడ్పీటీసీల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. ఇక పంచాయతీల్లోనూ ఏడాదిగా ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం, రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది.
129 ఎంపీటీసీ.. 16 జెడ్పీటీసీ..
ఒక్కో మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండాలనే నిబంధనతో పునర్విభజన చేపట్టగా.. జిల్లాలో 129 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గణాంకాల ప్రకారం రెండు స్థానాలు పెరిగిన మంచిర్యాల మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణతో హాజీపూర్ మండలంలోని మూడు ఎంపీటీసీ స్థానాలు విలీనం అయ్యాయి. జిల్లాలో 16 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఖరారైన గ్రామ పంచాయతీ ఓటరు జాబితా ప్రకారం పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారు. గతంలో 600 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండగా.. 700 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల్లో 745 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మూడు ఎంపీటీసీ స్థానాలు తగ్గడం, 700 మంది ఓటర్లకు ఒక కేంద్రం ఏర్పాటుతో పోలింగ్ కేంద్రాల సంఖ్య తగ్గనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 3,777 బ్యాలెట్ బాక్సులతో ఎన్నికలు నిర్వహిస్తారు. నోటిఫికేషన్ విడుదలైతే ఎన్నికల సిబ్బంది నియామక ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్లపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది. బీసీ రిజర్వేషన్ల అంశంతో ఆశావహులు ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అధికార కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకోవాలని చూస్తుండగా, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.