
ఊరిలోనే విత్తనోత్పత్తి
● నకిలీ విత్తనాలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం చర్యలు ● గ్రామీణ విత్తనోత్పత్తి పథకానికి శ్రీకారం
చెన్నూర్రూరల్: ప్రస్తుత కాలంలో వ్యవసాయ రంగంలో కల్తీ విత్తనాల సమస్య రైతులకు పెను సవాల్గా మారింది. కల్తీ విత్తనాలతో పంట దిగుబడి గణనీయంగా తగ్గడమే కాకుండా, రైతులు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ద్వారా ‘గ్రామీణ విత్తనోత్పత్తి పథకం’ను అమలు చేస్తూ రైతులను స్వయం విత్తనోత్పత్తిలో ప్రోత్సహిస్తోంది. ఈ పథకం ద్వారా రైతులు నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను తయారు చేసుకోవడమే కాకుండా, వాటిని ఇతర రైతులకు అందజేస్తూ కల్తీ సమస్యను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
పథకం లక్ష్యాలు
ఈ పథకం ప్రధాన ఉద్దేశం నూతన వంగడాల(రకాల) విత్తనాలను త్వరితగతిన ఉత్పత్తి చేయడం, అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం. పంటల సరళిని అనుసరించి విడుదలైన నూతన రకాలను ప్రవేశపెట్టడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. రైతులు స్వయంగా విత్తనాలను ఉత్పత్తి చేయడంతో కల్తీ విత్తనాల మోసాల నుంచి రక్షణ పొందడమే కాకుండా, నాణ్యత హామీతో పంట సాగు చేయవచ్చు.
అమలు ఇలా..
వ్యవసాయ శాఖ కేవీకే సహకారంతో ఈ పథకాన్ని జిల్లా వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం కింద రైతులకు వరి, పెసర పంటలకు సంబంధించిన విత్తనాలను 100 శాతం సబ్సిడీపై అందజేశారు. జిల్లాలో 650 బస్తాల 10 కిలోల వరి విత్తనాలు, 350 బస్తాల 3 కిలోల పెసర విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. వీటిని అందించేందుకు జిల్లాలోని ఆయా మండలాల్లోని రెవెన్యూ గ్రామాల నుంచి ముగ్గురు రైతుల చొప్పున ఎంపిక చేశారు.
మూడు దశల్లో శిక్షణ..
ఎంపిక చేసిన రైతులకు విత్తనోత్పత్తిపై శిక్షణ ఇస్తారు. విత్తనోత్పత్తి సాంకేతిక పరిజ్ఞానం, విత్తనాల విత్తే దూరం, సాగు పద్ధతులు తెలియజేస్తారు. పూత దశలో కలుపు మొక్కలను గుర్తించి తొలగించడం, సస్యరక్షణ పద్ధతులు, కోత పద్ధతులపై శిక్షణ ఇస్తారు. కోత తర్వాత విత్తనాలను ఇతర పంటలతో కలపకుండా తయారు చేయడం, నిల్వ పద్ధతులపై శిక్షణ ఇస్తారు.