
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
నిర్మల్ రూరల్: నిర్మల్ మండలం చిట్యాల వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. రూరల్ ఎస్సై లింబాద్రి కథనం ప్రకారం....భైంసా పట్టణంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన దివిటికర్ గంగుబాయి ఆమె భర్త బాబు, పింగువ అశోక్, సాయిపుత్ర ప్రజావాణిలో అర్జీలు అందజేసేందుకు ఆటోలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు బయలుదేరారు. చిట్యాల బ్రిడ్జి వద్దకు రాగానే నిర్మల్ నుంచి భైంసా వైపు వెళ్తున్న డీసీఎం అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొట్టి పంట పొలాల్లో పడిపోయింది. ఆటోలో ఉన్న గంగుబాయి, అశోక్, బాబు, డ్రైవర్ సాయిపుత్రకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. ఎస్సై లింబాద్రి సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వ్యాన్ డ్రైవర్ చేతన్ ప్రకాష్ మీనన్ను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు