
భక్తుల భద్రత గోదావరిలో దీపమే!
● ప్రాణాలు పోతున్నా పట్టింపేది? ● కానరాని కనీస రక్షణ చర్యలు ● ఇప్పటికీ ఏర్పాటు చేయని ఇనుప కంచె ● హామీలు నీటి రాతలే!
భైంసా: బాసర వద్ద గోదావరిలో నీటిమట్టం కనిష్ట స్థాయికి చేరింది. దీంతో కొన్నిరోజులుగా భక్తులు స్నానఘట్టాల వద్ద కాకుండా నది పొడవున స్నానాలు చేస్తున్నారు. నదిలో అక్కడక్కడ లోతైన ప్రాంతాలు ఉన్నాయని తెలియక స్నానం చేసేందుకు అందులోకి దిగి మృత్యువాత పడుతున్నారు. బాసర వద్ద గోదావరి నదిలో లోతు తెలిపే హెచ్చరిక బోర్డులు లేవు. భక్తులను అప్రమత్తం చేసే సిబ్బంది కూడా ఉండరు. దీంతో భక్తులు గోదావరినదిలో దిగి ప్రాణాలు కోల్పోతున్నారు.
పెరుగుతున్న ప్రమాదాలు
పదేళ్ల కాలంలో 127కు పైగా భక్తులు బాసర వద్ద గోదావరిలో నీటమునిగి మృతి చెందారు. 2021లో 10, 2022లో 12, 2023లో 11, 2024లో 10, 2025లో 8 మంది నీట మునిగి మృత్యువాత పడ్డారు. అయినప్పటికీ అధికారులు తేరుకోవడంలేదు. నదిలో నీటి ప్రవాహం తగ్గిన సమయాల్లోనూ మృత్యువాత పడడం కలచివేస్తుంది. భారీ వర్షాలతో నీటి ప్రవాహం పెరిగిన సమయాల్లో నదిలోకి వెళ్లేందుకు ఎవరైనా జంకుతారు. నీటి సామర్థ్యం తగ్గినప్పుడు స్నానాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈనెల 15న ఆదివారం ఆరుగురు యువకులు ఇసుక తెన్నెల నుంచి లోపలికి వెళ్లి స్నానాలు చేశారు. అందులో ఓ యువకుడు ప్రాణాలతో బయటపడగా రాకేశ్, భరత్, మదన్, వినోద్, రితిక్ అనే యువకులు మృతి చెందారు.
ఆరు నెలలైనా...
గోదావరి నదిలో జరుగుతున్న ప్రమాదాలపై జిల్లా ఎస్పీ జానకీ షర్మిల అప్పట్లో స్పందించారు. గతేడాది డిసెంబర్ 18న భైంసా ఏఎస్పీ అవినాశ్తో కలిసి బాసర వంతెన, నది పరీవాహక ప్రాంతాలను పరిశీలించారు. వంతెనలపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు 24 గంటలు పర్యవేక్షించేలా సిబ్బందిని నియమిస్తామన్నారు. రెండు జిల్లాల పోలీసుల సహకారంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, బ్లూ కోర్టు సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. ఆరునెలలు గడిచినప్పటికీ ఇప్పటికీ వంతెనపై ఇనుప కంచె ఏర్పాటు చేయలేదు.
స్థానిక యువకులు విన్నవించినా...
దక్షణ భారతావనిలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర. అందుకే ఇక్కడికి అధికసంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇక్కడ తరచూ జరుగుతున్న ప్రమాదాలను నివారించాలని 2022లోనే మిషన్ బాసర యువకులు, మేధావులు, యువజన సంఘాలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కలిసి అప్పటి ప్రభుత్వానికి, బాసర ఆలయ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. అయినప్పటికీ గోదావరి నదిలో ఏర్పాట్లను ఏ ఒక్కరూ పట్టించుకోవడంలేదు.
ఈ ఏర్పాట్లపై దృష్టి సారించాలి
● నదిలోతును తెలిపే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
● ప్రమాదాలు జరిగితే అత్యవసర సేవలు అందించేందుకు అంబులెన్సు, వైద్యులు అందుబాటులో ఉండాలి.
● నది నీటిలో నీళ్లు మింగి ఊపిరాడని పరిస్థితిలో ఉన్న వారికి సీపీఆర్ చేస్తే ప్రాణాలతో బయట పడొచ్చు అనే విషయాలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలి.
● గోదావరి నదిలో అన్ని స్నానఘట్టాల వద్దకు భక్తులను అనుమతించవద్దు.
● నది నీటిలోతు తెలుసుకుని ఇనుప కంచెలు ఏర్పాటు చేయాలి.
● బాసర ఆలయంతో పాటు ఆలయ అధికారులు గోదావరి నది సమీపంలో వచ్చే భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించాలి.
● ఆలయానికి రెగ్యులర్ ఈవోను నియమించాలి.
● బాసర నదికి వెళ్లే మార్గంలో, ఘాట్లకు వెళ్లే ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరించే ప్రదేశాల్లో, రాత్రి సమయాల్లోనూ కనిపించేలా వీధి దీపాలు ఏర్పాటు చేయాలి.
భక్తులంతా నదివద్దే...
బాసరకు వచ్చే భక్తులంతా ఎక్కువ సమయం గోదావరి నది వద్దే గడుపుతారు. నదిలో స్నా నాలు ఆచరించడం, గంగమ్మ తల్లికి పూజలు చేయడంతో పాటు రెండు వంతెనల పక్కన ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకే ఇష్టపడుతారు. వచ్చిన వారంతా నదిలో కాసేపు విహరించాలని అనుకుంటారు. నదులు ఉన్న పుణ్యక్షేత్రాల్లో వచ్చే భక్తుల కోసం ఎన్నో ఏర్పాట్లు ఉంటే బాసరలో పరీవాహక ప్రాంతాల్లో శుభ్రత పనులు కూడా కనిపించవు. వసంత పంచమి ఏర్పాట్లలో ఘాట్లు, గోదావరి నదీ తీరం అపరిశుభ్రంగా ఉండడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే రామారావు పటేల్ కార్యకర్తలతో వెళ్లి శుభ్రత పనులు చేపట్టారు. ఇక భక్తులకు కావాల్సిన కనీస వసతులు దేవుడెరుగు. ఆహ్లాదం పంచే గోదావరి నదిలో ఆదివారం వరకు బోట్లు తిప్పారు. లైఫ్ జాకెట్లు లేకుండా భద్రత విషయాలు పరిగణలోకి తీసుకోకుండా బోట్లను నదిలోకి పంపారు. ఈ బోట్లలోనే ఆరుగురు యువకులు నీటిలో నుంచి ఇసుక తెన్నెలకు వెళ్లి ప్రమాదాల భారిన పడ్డారు. ఒకే రోజు ఐదుగురు యువకులు గోదావరి నదిలో మృతి చెందడంతో జిల్లా రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ అభిలాషఅభినవ్ ఆదేశాలతో భైంసా ఆర్డీవో కోమల్రెడ్డి పరిస్థితిని తెలుసుకున్నారు. సోమవారం నుంచి బోటింగ్ను నిలిపివేశారు.
బాసర గోదావరిని పరిశీలించిన ఎస్పీ
బాసర: బాసర గోదావరినదిని ఎస్పీ జానకీ షర్మిల సోమవారం పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్నానఘట్టాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. పుష్కర ఘాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.

భక్తుల భద్రత గోదావరిలో దీపమే!