
● రోడ్డు ప్రమాదంలో అమ్మమ్మ, మనుమడు దుర్మరణం ● ఉట్నూర్ల
దైవ దర్శనానికి వెళ్లి మొక్కులు తీర్చుకున్న ఆ కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మరికాసేపట్లో ఇంటికి చేరుకునే క్రమంలో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి చెట్టును ఢీకొంది. అప్పటివరకు సంతోషంగా గడిపిన వారంతా చెల్లాచెదురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఇద్దరు తనువు చాలించారు. ఈ ఘటనలో అమ్మమ్మ, మనుమడు మృతి చెందగా మనవరాలి పరిస్థితి విషమంగా ఉంది. బాధిత కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆదిలాబాద్టౌన్/ఉట్నూర్రూరల్: ఆదిలాబాద్ పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన ఈర్ల రాజు డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్నాడు. రెండో శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో అతని భార్య సృజనిత, కుమారుడు సాహర్శ్(15), కుమార్తె ఆద్యశ్రీతో పాటు సృజనిత తల్లి గంట విజయ(55)తో కలిసి దైవదర్శనం చేసుకునేందుకు శుక్రవారం జిల్లా కేంద్రం నుంచి కారులో బయల్దేరి వెళ్లారు. కాళేశ్వరం, ధర్మపురి, ఇతర దేవాలయాలను దర్శించుకున్నారు. అనంతరం బెల్లంపల్లిలో నివాసం ఉంటున్న సృజనిత అక్క ఇంటికి వెళ్లారు. ఆదివారం అక్కడే ఉన్నారు. సోమవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో బయలుదేరారు. మార్గమధ్యలో ఉట్నూర్ మండలంలోని బీర్సాయిపేట్ మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. సాహర్శ్, విజయ సంఘటన స్థలంలోనే మృతి చెందగా ఆద్యశ్రీ తలకు తీవ్రగాయాలయ్యా యి. ముందుగా రిమ్స్ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు పేర్కొన్నా రు. రాజు, సృజనిత గాయాలతో బయటపడ్డారు. కారు డ్రైవర్ రాజుకు కునుకు రావడంతోనే ఈ ప్రమా దం జరిగి ఉండవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ఉట్నూర్ ఎస్సై మనోహర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
మిన్నంటిన రోదనలు..
రోడ్డు ప్రమాదం విషయం తెలియడంతో బాధిత కుటుంబీకులు, బంధువులతో పాటు కాలనీవాసులు అధికసంఖ్యలో రిమ్స్ ఆస్పత్రితో పాటు వారి ని వాసానికి చేరుకుని చేసిన రోదనలు మిన్నంటాయి. ఉన్న ఇద్దరు పిల్లల్లో ఒకరు మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. బడులు ప్రారంభం కావడంతో పిల్లలు తరగతులు నష్టపోతారని హడావుడిగా తీసుకువస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సాహర్శ్ జిల్లా కేంద్రంలోని రిజోనెన్స్ పాఠశాలలో పదో తరగతి, ఆద్యశ్రీ అదే పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నారు. విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం, తోటి స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు.
పలువురి పరామర్శ..
రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రిమ్స్ ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. పీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కిసాన్సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
సంఘటన స్థలంలో కూతురితో సృజనిత

● రోడ్డు ప్రమాదంలో అమ్మమ్మ, మనుమడు దుర్మరణం ● ఉట్నూర్ల