
సైబర్ బాధితులకు నగదు అందజేత
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో ఈ నెలలో పది కేసుల్లో సైబర్క్రైమ్ బాధితులకు తిరిగి డబ్బులు అందించామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఐదుగురు బాధితులు ఎస్పీని కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యాపల్గూడకు చెందిన నర్సింగ్ గతేడాది రూ.16,901 కేవైసీ అప్డేట్ లింక్ ఓపెన్ చేయడంతో పోగొట్టుకున్నారని, జైనథ్ మండలానికి చెందిన లింగారెడ్డి గూగుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ కేర్ సర్వీస్ ఫేక్ నంబర్ ఓపెన్ చేసి రూ.2లక్షల 15వేలు పోగొట్టుకోవడంతో రూ.లక్షా 30వేలు తిరిగి అకౌంట్లో వేయించామన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మివాడకు చెందిన జి.రమేశ్ ఫ్రాడ్ ఇన్వెస్ట్మెంట్లో సైబర్ నేరగాళ్లు రూ.లక్షా 59వేలు కాజేయగా రూ.60వేలు ఇప్పించామన్నారు. మావలకు చెందిన మితిలి అనే మహిళ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ ద్వారా స్నేహితుడిగా సహాయం కోరిన వెంటనే రూ.25వేలు పంపించడంతో తిరిగి వాటిని సైతం ఇప్పించినట్లు తెలిపారు. ఉట్నూర్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి స్టాక్ మార్కెట్లో దాదాపు రూ.3లక్షలు పోగొట్టుకోగా రూ.50 వేలు కోర్టు ద్వారా అందించినట్లు వివరించారు. సైబర్ క్రైమ్కు గురైన బాధితులు వెంటనే 1930, పోలీస్స్టేషన్లో సంప్రదించాలన్నారు.