హైదరాబాద్‌లో యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో యువకుడి ఆత్మహత్య

Jun 16 2025 6:59 AM | Updated on Jun 16 2025 6:59 AM

హైదరాబాద్‌లో యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్‌లో యువకుడి ఆత్మహత్య

● ముల్కల్లలో ఉద్రిక్తత ● మహిళ ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన ● పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌):మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గుడిపేటకు చెందిన దేవి ప్రశాంత్‌ (27) హైదరాబాద్‌లో శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన వెనుక వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. దేవి ప్రశాంత్‌ బీటెక్‌ పూర్తి చేసి అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం ముల్కల్లకు చెందిన ఓ మహిళతో అతనికి పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతర సంబంధంగా మారింది. మూడు నెలల క్రితం వివాహిత తన కుమారుడితో కలిసి హైదరాబాద్‌ వెళ్లగా, కుటుంబ సభ్యుల ఒత్తిడితో కుమారుడిని అప్పగించింది. పంచాయితీ తర్వాత ఇరువురూ విడివిడిగా ఉంటున్నా.. సోషల్‌ మీడియాలో చాటింగ్‌ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వారం క్రితం ఇరువురూ మరోసారి హైదరాబాద్‌ వెళ్లారు. దీంతో వివాహిత కుటుంబ సభ్యులు హాజీపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ప్రశాంత్‌ సోదరుడు రాజశేఖర్‌ సహాయంతో వివాహిత గురువారం ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ప్రశాంత్‌ హాజీపూర్‌, మంచిర్యాల ప్రాంతాల్లో తిరిగి, చివరకు హైదరాబాద్‌కు వెళ్లాడు.

ఆత్మహత్యపై అనుమానాలు

శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌ ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి రాజశేఖర్‌కు ఫోన్‌ వచ్చింది. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వెళ్లి చూడగా ప్రశాంత్‌ విగతజీవిగా కనిపించాడు. అతని మృతిపై కుటుంబ సభ్యులు బలమైన అనుమానాలు వ్యక్తం చేశారు. ఆదివారం పోస్ట్‌మార్టం అనంతరం అంబులెన్స్‌లో ప్రశాంత్‌ మృతదేహాన్ని గుడిపేటకు తీసుకొచ్చారు.

అంబులెన్స్‌ డ్రైవర్ల ర్యాలీ..

ప్రశాంత్‌ సహచర అంబులెన్స్‌ డ్రైవర్లు సంతాప సూచకంగా వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వివాహిత కుటుంబ సభ్యులు మృతుడి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. బాధిత కుటుంబ సభ్యులు వివాహిత తల్లిదండ్రుల ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్లి ఆందోళన నిర్వహించారు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. ప్రశాంత్‌ సోదరుడు రాజశేఖర్‌ తమ్ముడి మరణం ఆత్మహత్య కాదని, వివాహిత కుటుంబ సభ్యులు హత్య చేశారని ఆరోపిస్తున్నాడు.

పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి

మంచిర్యాల రూరల్‌ సీఐ ఆకుల అశోక్‌, హాజీపూర్‌ ఎస్సై స్వరూప్‌రాజ్‌, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్‌, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, లక్సెట్టిపేట ఎస్సై గోపతి సురేశ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఏసీపీ హామీ ఇవ్వడంతో వివాదం సద్దు మణిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement