
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
భీమారం: మండలంలోని పోలంపల్లి, భీమారం గ్రామాల సమీపంలో ఆదివారం రెండు చోట్ల దాడులు నిర్వహించి నాలుగు కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు ఎస్సై శ్వేత తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు పోలంపల్లి సమీపంలో నకిలీ పత్తి విత్తనాలతో వెళ్తున్న రేషవేని సత్యనారాయణను పట్టుకున్నట్లు తెలిపారు. భీమారం సమీపంలోని బాల్క సుమన్ రోడ్డులో ఒక సంచితో అన్నవేని నర్సయ్య అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా నకిలీ పత్తి విత్తనాలు లభించాయన్నారు. ఈ మేరకు వ్యవసాయ అధికారి సుధాకర్తో పరీక్షలు నిర్వహించగా గ్లైసిడ్ విత్తనాలు అని తేలిందన్నారు. ఈ మేరకు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
కడెం ఎడమ కాలువ సిల్ట్ తొలగింపు
కడెం: కడెం ప్రాజెక్ట్ ఎడమ కాలువ గేట్ల వద్ద పేరుకుపోయిన సిల్ట్ను తొలగించేలా ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. నాలుగు రోజు లుగా పొక్లెయిన్ సహాయంతో సిల్ట్ను తొలగిస్తూ కాలువ నీరు చివరి ఆయకట్టుకు సక్రమంగా చేరేలా మరమ్మతు పనులు చేస్తున్నట్లు ఈఈ విఠల్ పేర్కొన్నారు.
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన పోలీసులు
తాంసి: మండలంలోని వడ్డాడిలో మత్తడివాగు ప్రాజెక్టు వద్ద ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని ఆదివారం తాంసి పోలీసులు కాపాడారు. తాంసి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన ప్రభాకర్ కుటుంబ సమస్యలతో పాటు మానసిక స్థితి సరిగా లేక ఆత్మహత్య చేసుకునేందుకు సాయంత్రం ప్రాజెక్టు వద్దకు వచ్చాడు. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు 100కు డయల్ కాల్ చేయడంతో అప్రమత్తమైన పెట్రోలింగ్ సిబ్బంది వికాస్ అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు సైతం మత్తడివాగు ప్రాజెక్టు వద్దకు ఆత్మహత్యకు పాల్పడటానికి రాగా పోలీసులు అడ్డుకున్నారు.