
డీసీసీబీ డైరెక్టర్ హరీష్రావు కిడ్నాప్..!
● అర్ధరాత్రి ఇంట్లో నుంచి తీసుకువెళ్లిన దుండగులు ● తుఫ్రాన్ టోల్ప్లాజా వద్ద తప్పించుకున్న బాధితుడు
నిర్మల్టౌన్: మామడ మాజీ ఎంపీపీ, ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చిక్యాల హరీష్ రావు కిడ్నాప్కు గురైన సంఘటన జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. శనివారం అర్ధరాత్రి 2 గంటలకు మామడ మండలం పోన్కల్ గ్రామంలో హరీష్ రావు తన ఇంట్లో నిద్రపోతున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆయనను తన వాహనంలోనే కిడ్నాప్ చేశారు. హైదరాబాద్ వైపు తరలించారు. వెళ్లే దారిలో భారీగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో హరీష్ రావు తన సన్నిహితులకు ఫోన్ చేసి కొంత నగదు కావాలని కోరినట్లు సమాచారం. తుఫ్రాన్ టోల్ ప్లాజా వద్ద కారు ఆగిన సమయంలో హరీష్ రావు చాకచక్యంగా కారు దిగి తప్పించుకున్నారు. దీంతో దుండగులు ఆగకుండా టోల్ గేటును గుద్దేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. హరీష్ రావు జరిగిన విషయాన్ని టోల్ ప్లాజా సిబ్బందికి తెలియజేసి తుఫ్రాన్ పోలీసులను సంప్రదించాడు. దీంతో పోలీసులు హరీష్రావును ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని సబ్ డివిజనల్ కార్యాలయానికి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హరీష్ రావు వద్ద గతంలో పనిచేసిన వ్యక్తే కిడ్నాప్ చేసినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.