
కత్తులతో పోస్టు పెట్టిన ఒకరి రిమాండ్
ఆదిలాబాద్టౌన్: సోషల్ మీడియాలో కత్తులతో పోస్టుపెట్టిన ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలోని కొత్త కుమ్మరవాడకు చెందిన దన్గట్ సుధీర్ మూడు నెలల క్రితం మావలలో పశువుల వాహనాన్ని అడ్డుకుని సదరు యజమానిని చంపుతానని బెదిరించినట్లు పేర్కొన్నారు. డబ్బులు వసూలు చేసి దౌర్జన్యం చేసిన కేసులో పరారీలో ఉన్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో కత్తులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తేలా పోస్టులు పెట్టినట్లు వివరించారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ యజమానిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిపారు. అతనిపై పోలీస్స్టేషన్లో తొమ్మిది కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అల్లపల్లిలో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితుని వద్ద నుంచి సోషల్ మీడియాలో పెట్టిన కత్తి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో వన్టౌన్, మావల సీఐలు సునీల్ కుమార్, కె.స్వామి పాల్గొన్నారు.