అరచేతిలో స్వర్గం చూపిస్తున్న ప్రభుత్వాలు
స్టేషన్ మహబూబ్నగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే, ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని మదీనా మజీద్ చౌరస్తాలో శనివారం రాత్రి జరిగిన ఎంఐఎం మున్సిపల్ ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న అన్యాయాలపై ఎంఐఎం ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు. అసెంబ్లీలో అన్ని వర్గాల ప్రజల సమస్యలను లేవనెత్తుతానని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల, ఇరిగేషన్, టూరిజం ఇలా ప్రతి రంగం సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతానని అన్నారు. ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. గతంలో ఒకరు బంగారు తెలంగాణ అంటూ, ఇప్పుడు బంగారం ఇస్తామని హామీ ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. ఎవరికై నా తులం బంగారం అందిందా అని ప్రజలను అడిగారు. ప్రజల మద్దతే ఎంఐఎం పార్టీకి బలమన్నారు. ఇటీవలముంబైలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని అన్నారు. మహబూబ్నగర్లో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటర్లు ఎంఐఎం అభ్యర్థులకు మద్దతుగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంమహారాష్ట్రకు చెందిన మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్, ఎన్నికల ఇన్చార్జిలు జఫర్ఖాన్, సాదత్ అన్వర్, జిల్లా నాయకులు జాబిర్ బిన్ సయీద్, అబ్దుల్ హాదీ, మక్సూద్బిన్ అహ్మద్ జాకీర్, సాదతుల్లా హుస్సేని పాల్గొన్నారు.


