మన్యంకొండ.. భక్తజన సంద్రం
● దాసంగాలతో స్వామివారికి నైవేద్యం
● వైభవంగా శేషవాహన సేవ
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండలోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం శనివారం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. బ్రహ్మోత్సవాల్లో విశేష సేవలు పూర్తయినప్పటికీ జాతర మాత్రం నెల రోజుల పాటు కొనసాగుతుంది. ఈ క్రమంలో శనివా రం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి పూజ కార్యక్రమాలు జరిపించారు. దిగువ కొండ, తేరు మైదానం, కోనేరు ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందుగా కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారికి ప్రీతిపాత్రమైన దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
వైభవంగా శేషవాహన సేవ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి శేషవాహన సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన శేషవాహనంలో స్వామివారిని గర్భగుడి నుంచి రథాల మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, కాగడాల వెలుతురులో స్వామివారి సేవ ముందుకు కదిలింది. భక్తులు చేసిన హరినామ స్మరణతో ఆ ప్రాంతం మారుమ్రోగిపోయింది. బంగారు ఆభరణాలు, రకరకాల పూల అలంకరణలో స్వామివారు లైట్ల వెలుతురులో ధగధగ మెరిసిపోతూ శేషవాహనంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం రథాల మంటపం వద్ద తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి తిరిగి మళ్లీ శేష వాహనంలో స్వామివారిని గర్భగుడిలోకి తీసుకెళ్లారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారితో పాటు పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
మన్యంకొండ.. భక్తజన సంద్రం


