ఇతర పంటలకే ప్రాధాన్యం..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో రైతులు అధికంగా వరి, పత్తి పంటలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈసారి నాగర్కర్నూల్ మినహా అన్ని జిల్లాల్లోనూ పత్తి పంట సాగు తగ్గించి వరి వైపు రైతులు మొగ్గుచూపారు. మహబూబ్నగర్లో ఈసారి వరి 10 వేల విస్తీర్ణం పెరగగా.. పత్తి 2 వేల ఎకరాలు తగ్గింది. నాగర్కర్నూల్లో వరి విస్తీర్ణం ఏకంగా 66 వేల ఎకరాలు పెరిగింది. అలాగే పత్తి విస్తీర్ణం సైతం గతేడాది కన్నా 4 వేలు అధికంగా సాగైంది. నారాయణపేటలో వరి గతేడాది కంటే 10 వేల ఎకరాల్లో రైతులు అధికంగా సాగుచేశారు. ఇక్కడ అధికంగా 50 వేల ఎకరాల్లో కందిపంట సాగవుతోంది. వనపర్తి జిల్లాలో వరి 8 వేల ఎకరాలు పెరగగా.. పత్తి విస్తీర్ణం 5 వేల ఎకరాలు తగ్గింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈసారి పత్తి సాగు 70 వేల ఎకరాల వరకు తగ్గగా.. వరి పంట విస్తీర్ణం 7 వేల ఎకరాలు తక్కువగా నమోదైంది.
‘పాలమూరు’ పనుల్లో కదలిక..
ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు అందించే ఉద్దేశంతో చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఈ ఏడాది ప్రాజెక్టు పనులను పరిశీలించారు. వచ్చే ఏడాది మార్చి కల్లా ప్రాజెక్టు కింద సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా రైతులకు వరప్రదాయినిగా నిలిచే ఈ ప్రాజెక్టు పనుల్లో కదలికతో రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. ఈ ప్రాజెక్టు కింద చేపట్టిన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు పూర్తిస్థాయిలో మోటార్ల బిగింపు పూర్తయితేనే సాగునీరు అందనుంది. అలాగే రిజర్వాయర్ల నుంచి ఆయకట్టు రైతులకు నీరందించేందుకు డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు, ఫీడర్ చానళ్ల నిర్మాణం చేపడితేనే రైతులకు మేలు చేకూరుతుంది.


