సాగులో నూతన ఒరవడి
సాక్షి, నాగర్కర్నూల్: పాలమూరు రైతులు సాగులో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈసారి పత్తి కన్నా.. వరి, మొక్కజొన్న ఇతర పంటలు సాగు చేసేందుకు మొగ్గుచూపారు. పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా.. పలుచోట్ల ఆయిల్పాం, ఉద్యాన, వాణిజ్య పంటలు పండించేందుకు ఆసక్తి చూపారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఈసారి 900 ఎకరాల్లో ఆయిల్పాం తోటలు సాగైంది. గద్వాల జిల్లాలో పొగాకు, వనపర్తి జిల్లాలో చెరకు, బెబ్బర పంటలు పండించారు. ఈ క్రమంలోనే నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఈ ఏడాది పత్తి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. మిగతా మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో రైతులు గతేడాది కన్నా ఈసారి వానాకాలంలో వరి, పత్తి పంటలు అధికంగా సాగుచేశారు. కానీ, జిల్లాలో ఈ ఏడాది పత్తి పంట సాగుచేసిన రైతులకు నష్టాలే మిగిలాయి. అధిక వర్షాల నేపథ్యంలో పత్తి పంట దెబ్బతిని దిగుబడి సగానికి పడిపోయింది. దీంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది.
సగానికి తగ్గిన దిగుబడి..
ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా రైతులు పత్తిపంట సాగుచేస్తున్నారు. అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లాలో 2.86 లక్షలు, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో 1.50 లక్షల ఎకరాలకు మించి పత్తి సాగవుతోంది. మహబూబ్నగర్లో 80 వేలు, వనపర్తిలో తక్కువగా 12 వేల ఎకరాల్లోనే రైతులు పత్తి సాగు చేశారు. అయితే ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభం నుంచి నిరాటంకంగా కురిసిన వర్షాలతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. మొక్క దశ నుంచే దెబ్బతినడంతో పత్తి దిగుబడి సగానికి తగ్గింది. దీంతో రైతులకు పెట్టుబడులు కూడా రాలేదు. కౌలుకు తీసుకుని సాగుచేసిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సీసీఐ కొనుగోళ్ల ద్వారా క్వింటాకు రూ.8 వేల వరకు ధర పలికినా రైతులకు గిట్టుబాటు కాలేదు.
పాలమూరులో వినూత్న పంటల వైపు రైతుల మొగ్గు
పలుచోట్ల ఆయిల్పాం, వాణిజ్య తోటల పెంపకం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీగా తగ్గిన పత్తి సాగు, దిగుబడి
తీవ్ర నష్టాలు మిగిల్చిన వానాకాలం
యూరియా కోసం రైతాంగానికి తప్పని పడిగాపులు
సాగులో నూతన ఒరవడి


