
ఫీజుల మోత!
● క్రిస్టియన్పల్లి వద్ద ఉన్న మరో పాఠశాలలో కూడా అడ్మిషన్లు పూర్తయ్యాయని యాజమాన్యం చెపుతోంది. అయితే అక్కడికి వెళ్లిన విద్యార్థులకు సీటు ఇవ్వాలంటే మొదట స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి, అందులో మంచి మార్కులు వస్తేనే ఇస్తున్నామని చెబుతున్నారు. దీంతో సీటు ఇస్తే చాలు.. ఫీజు ఎంతైనా చెల్లిస్తామని తల్లిదండ్రులు సీటు కోసం పైరవీలు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ స్కూల్లో 8వ తరగతి విద్యార్థికి రూ.60 వేల ట్యూషన్ ఫీజు, రూ.18వేల బస్ ఫీజు వసూలు చేస్తున్నారు. షూ, టై, బెల్టు, పుస్తకాలు, నోట్బుక్కులు అదనం.
● తెలంగాణ చౌరస్తాలో ఓ పాఠశాలలో గతంలో పుస్తకాలు అమ్ముతుండగా.. విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఆ పాఠశాలలో పుస్తకాల విక్రయాలు కొనసాగుతున్నాయి. అలాగే జడ్చర్లలోని ఓ పాఠశాలలో పుస్తకాలు అమ్ముతుండగా బుధవారం ఏబీవీపీ నాయకులు పట్టుకున్నారు. బాలానగర్లోని మరో పాఠశాలపై కూడా ఫిర్యాదులు రావడంతో అధికారులు పుస్తకాలను సీజ్ చేశారు.
● ఇటీవల జిల్లాకేంద్రంలో ఏనుగొండ వద్ద ఓ కార్పొరేట్ పాఠశాల ప్రారంభమైంది. పాఠశాలలు తెరవకముందే అడ్మిషన్లు అయిపోయాయని బోర్డులు పెట్టారు. కార్పొరేట్ పాఠశాల కావడంతో తమ పిల్లలను అక్కడే చేర్పించేందుకు తల్లిదండ్రులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. దీన్ని ఆసరా చేసుకొని తరగతుల వారీగా ఒక్కో విద్యార్థికి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వసూలు చేస్తున్నారు. తొలి ఏడాదే 650 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు.
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: తమ పిల్లలను ఉన్నతంగా ప్రైవేటు బడుల్లో చదివించాలన్న తల్లిదండ్రుల ఆశ కొన్ని ప్రైవేటు పాఠశాలలకు కాసుల పంట పండిస్తోంది. విద్యాశాఖ అధికారుల వైఫల్యం, తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. ఫీజుల నియంత్రణ లేకపోవడంతో ఎల్కేజీ విద్యార్థికి సైతం రూ.వేలల్లో వసూలు చేసే పరిస్థితి నెలకొంది. బస్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, షూ, టై, బెట్టు అంటూ ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలను నియంత్రించాల్సిన విద్యాశాఖ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
సొంత సిలబస్ బోధన..
అన్ని పాఠశాలల్లో ప్రభుత్వం సూచించిన సిలబస్ మాత్రమే బోధించేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ కొన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు స్టేట్ సిలబస్ను పక్కన పెట్టి.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు సొంత సిలబస్ బోధిస్తున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కి ప్రభుత్వం ఇప్పటికీ సిలబస్ను సూచించలేదు. కానీ వారికి కూడా ప్రైవేటు పబ్లికేషన్స్లో సిలబస్ తయారు చేసి విద్యార్థులకు బోధిస్తున్నారు. ఈ పాఠ్య పుస్తకాల కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు.
కనీస సౌకర్యాలు కరువు..
పాఠశాల తరగతి గదుల్లో వెలుతురు, గాలితో పాటు శుభ్రత ఉండాలి. చాలా పాఠశాలల్లో రేకుల షెడ్లే తరగతి గదులుగా కొనసాగుతున్నాయి. వెలుతురు లేకపోగా.. ఫ్యాన్లు కూడా సక్రమంగా తిరగని పరిస్థితి ఉంది. మెజార్టీ పాఠశాలల్లో పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు లేవు. దీంతో విద్యార్థుల్లో మానసిక వికాసం తగ్గిపోతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు.
● ప్రతి పాఠశాలకు ఒక పేరెంట్స్ కమిటీ ఉండాలి. పాఠశాల యాజమాన్యాలు మాత్రం వారికి అనుకూలమైన వారిని పెట్టుకొని పేరెంట్స్ కమిటీలను కాగితాలకే పరిమితం చేస్తున్నాయి. చాలా పాఠశాలలు ఈ కమిటీలను వేయడం లేదు.
ప్రైవేటు పాఠశాలల్లో తడిసి మోపెడవుతున్న ఫీజులు
ఐఐటీ, నీట్ ఫౌండేషన్ పేరుతో
అదనపు వసూళ్లు
బడుల్లోనే పుస్తకాలు,
యూనిఫామ్స్ విక్రయాలు
చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు

ఫీజుల మోత!