
సంక్షేమ హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ విజయేందిరబోయి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు, కేజీబీవీలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థులు చదువుకునేందుకు అనువైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్య, నోట్పుస్తకాలు ఎంతమందికి అందజేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. యూనిఫామ్స్ త్వరితగతిన మహిళా సంఘాల ద్వారా కుట్టించి అందజేయాలని డీఆర్డీఓను ఆదేశించారు. ఇంకా కళాశాల, పాఠశాలలకు రాని విద్యార్థుల తల్లిదండ్రులకు గురుకుల పాఠశాలల, ప్రిన్సిపాళ్లు ఫోన్ చేసి తరగతులకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. కేజీబీవీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 5వ తరగతిలో చేరే విద్యార్థులు ఎంత వరకు చదవగలుగుతున్నారో పరిశీలించాలన్నారు. పాఠశాల ఆవరణలో చెత్త, పాత సామగ్రి లేకుండా చూడాలని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని, పాడైపోయిన కూరగాయలు, గుడ్లు తీసుకోకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. బాలికల క్యాంపస్లో ఎక్కడా చీకటి లేకుండా లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలని, ఆహారం వండిన తర్వాత రుచి చూడాలని, రిజిస్టర్లో రోజువారీగా నమోదు చేయాలని, మెడికల్, హెల్త్ చెకప్స్ చేయడానికి డాక్టర్స్ వచ్చినప్పుడు ప్రతి విద్యార్థికి వేర్వేరుగా ఫైల్స్ను ఉపయోగించాలని, హెల్త్ చెకప్కి సంబంధించిన వివరాలను ప్రిన్సిపాల్ వద్ద అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి క్యాంపస్లో కంప్లైంట్ బాక్స్ను ఏర్పాటు చేయాలని, కంప్యూటర్ ల్యాబ్లు అన్ని క్యాంపస్లో పనిచేయాలన్నారు. అనంతరం సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఈఓ ప్రవీణ్కుమార్, డీఆర్డీఓ నర్సింహులు, మైనార్టీ సంక్షేమ అధికారి శంకరాచారి, బీసీ అభివద్ధి అధికారిణి ఇందిర, గిరిజనాభివృద్ధి అధికారి జనార్దన్, ఎస్సీ అభివృద్ధి అధికారిణి సునీత, సీఎంఓ బాలుయాదవ్, ఏఎంఓ శ్రీనివాస్, ఎంఈఓలు, గురుకుల పాఠశాలల ఆర్సీఓలు, డీసీఓలు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ విజయేందిర బోయి