
విత్తనోత్పత్తికి ప్రోత్సాహం
మహబూబ్నగర్ (వ్యవసాయం): గ్రామస్థాయిలో విత్తనోత్పత్తిని ప్రోత్సహించి.. రైతులకు మేలు రకమైన విత్తనాలను అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం నాణ్యమైన విత్తనం–రైతన్నకు నేస్తం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడకుండా రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేసుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వ్యవసాయశాఖ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో విత్తుకొద్దీ పంట పేరుతో గ్రామాల వారీగా రైతులను ప్రతి గ్రామంలో ముగ్గురు రైతులను ఎంపిక చేసింది. 95 శాతం సబ్సిడీపై మూల విత్తనాలు పంపిణీ చేస్తుంది.
● వరి, జొన్న, కంది విత్తనోత్పత్తి వంగడాలు పండించేందుకు వ్యవసాయశాఖ అధికారులు రైతుల ను ఎంపిక చేశారు. జిల్లాలోని 17 మండలాలు.. 306 రెవెన్యూ గ్రామాలు ఉండగా, అన్ని మండలాల్లో గ్రామానికి ముగ్గురు రైతులను గుర్తించారు. ఇందులో వరి విత్తనోత్పత్తి సాగుకు 306 మంది, జొన్నకు 306 మందిని, కందికి 306 మందిని ఎంపిక చేశారు. ఎంపిక చేసిన రైతులకు 10 కిలోల వరి విత్తన బస్తా కేవలం రూ.50కే అందజేస్తున్నారు. అలాగే నాలుగు కిలోల చొప్పున జొన్న, కంది విత్తన బసాల్తను సైతం రూ.50కే ఇస్తున్నారు. విత్తనాలు ఉచితంగా ఇస్తే రైతులకు ఆసక్తి ఉండదన్న ఉద్దేశంతో మొక్కుబడి చార్జీలు వేసినట్లు సంబంధిత వ్యవసాయ అధికారి ఒకరు తెలిపారు. కాగా ఈ విత్తనాలను సాగు చేసిన రైతులు పంట ఉత్పత్తి జరిగిన అనంతరం గ్రామంలోని తోటి రైతులకు అందజేయాల్సిన ఉంటుంది. ఇలా రైతులు తమకు కావాల్సిన విత్తనాలను వారే సొంతంగా పండించుకునే కార్యాచరణను ప్రభుత్వం రూపొందించింది. జిల్లావ్యాప్తంగా విత్తనాల పంపిణీ పండగలా నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు పాల్గొని సన్న రకం వరి, కంది, జొన్న మూల విత్తనాలను రైతులకు అందజేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొని రైతులకు పంటల సాగులపై అవగాహన కల్పిస్తున్నారు.
శాస్త్రవేత్తల పరిశీలన
విత్తనాల నారు సిద్ధం కాగానే వ్యవసాయ శాస్త్రవేత్తలు, జిల్లా వ్యవసాయ అధికారులు వాటిని పరిశీలిస్తారు. నాటు ఎలా వేయాలి.. ఎంతమేర మందులు వాడాలి.. నీరు ఏ మోతాదులో అందించాలి.. కలుపు తీసే విధానం, సస్యరక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు అందజేసి పంట పూర్తయ్యే వరకు పరిశీలిస్తారు. రైతులు అత్యధిక దిగుబడులు సాఽధించేలా మెళకువలు అందిస్తారు.
కల్తీ విత్తనాలకు చెక్
కల్తీ విత్తనాలతో ఎంతోమంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలు నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వాటిని తీర్చే మార్గం కానరాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతులే సొంతంగా సీడ్ విత్తనాలను పండించడంతో తిప్పలు తప్పనున్నాయి. ఈ విత్తనోత్పత్తి అంతకంతకు పెరిగితే కల్తీ విత్తనాలు విక్రయించే మోసగాళ్లకు చెక్ పెట్టవచ్చు.
మేలైన విత్తనాలుఅందుబాటులోకి
నాణ్యమైన విత్తనం– రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా మేలైన విత్తనాలు అందిస్తుండటంతో గతంతో పోలిస్తే పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంది. అలాగే నాణ్యమైన విత్తనాలతో సాగు చేసిన ఒక్క రైతు 80 నుంచి 100 మంది రైతులకు విత్తనాలు అందించే అవకాశం ఉంటుంది. ఒకసారి పండించిన విత్తనాలను మూడేళ్ల వరకు వాడుకోవచ్చు. సొంతంగా విత్తనాలను పండించుకోవడంతో విత్తనాల కోసం కంపెనీలపై ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు. నాణ్యమైన విత్తనాలు సొంత గ్రామంలో లభించడంతో రైతులకు మంచి లాభసాటిగా ఉంటుంది. భవిష్యత్లో గ్రామాలే విత్తన కేంద్రాలుగా ఏర్పడనున్నాయి.
– బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
ఉత్సాహంగా నాణ్యమైన విత్తనం– రైతన్నకు నేస్తం
జిల్లాలో 918 మందికి అవకాశం
ఊరూరా రైతులకు మూల విత్తనాల పంపిణీ