
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్య
స్టేషన్ మహబూబ్నగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని, మీ పిల్లల భవిష్యత్ కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేర్పించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. కళాశాల విద్యార్థులకు చదువుతో పాటు కల్చరల్, స్పోర్ట్స్లో శిక్షణ ఇస్తారని, ఉన్నతంగా తీర్చిదిద్దుతారన్నారు. పయనీర్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఎప్ సెట్, నీట్ ఎంట్రన్స్ కోసం మహబూబ్నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను ఇప్పించనున్నట్లు తెలిపారు. గతేడాది 114 మంది ఎప్ సెట్లో ఉత్తమ ర్యాంకులు వచ్చాయని, వారందరికీ అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ఉచితంగా ప్రవేశం లభిస్తాయని, ఈ ఏడాది ఆ సంఖ్య రెండింతలు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ భగవంతాచారి మాట్లాడుతూ గత విద్యాసంవత్సరం ఎమ్మెల్యే ఇచ్చిన స్ఫూర్తితో పనిచేసి మంచి ఫలితాలు సాధించామని, విద్యార్థులకు ఇచ్చిన స్టడీ మెటీరియల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. ఈ ఏడాది మరింత ఉత్సాహంగా పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది అలీమోద్దీన్, నగేష్, వెంకటప్ప, ఈశ్వర్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.
26న జాబ్మేళా
జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈనెల 26న నిర్వహించనున్న అప్రెంటిస్, జాబ్మేళా కార్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డిని ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్ బి.నర్సింలు, సిబ్బంది ఆహ్వానించారు. క్యాంపు కార్యాలయంలో ఆహ్వానపత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఎన్పీ వెంకటేశ్, ఎం.సురేందర్రెడ్డి, కళాశాల సిబ్బంది కొండయ్య, హెచ్.శ్రీనివాస్, ఇస్మాయిల్, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.