
గోదాంలో మిరప సంచుల గోల్మాల్
ఎర్రవల్లి: మండలంలోని వేముల శివారులో ఉన్న మెగా చిల్ కోల్డ్ స్టోరేజీలో మిరప సంచుల గోల్మాల్ జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టడంతో తిరిగి సంచులను బాధితుడికి అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలుకు చెందిన మిర్చి వ్యాపారి రసూల్మియా 2023లో 449 ఎండు మిర్చి (2043 రకం) బస్తాలను కోదండాపురం, మునుగాల, నీలిపల్లి గ్రామాల రైతుల వద్ద కొనుగోలు చేసి ధరలు పడిపోవడంతో వేముల శివారులో ఉన్న మెగా చిల్ కోల్డ్స్టోరేజీలో నిల్వ చేశారు. ఇటీవల రసూల్మియా కుటుంబ సభ్యులతో కలిసి కోల్డ్ స్టోరేజీకి వెళ్లి తన బస్తాలను చూపించాలని మేనేజర్తో పాటు యజమానిని కోరినా స్పందించలేదు. దీంతో మంగళవారం కోదండాపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ మురళి సిబ్బందితో కలిసి కోల్డ్ స్టోరేజీకి వెళ్లి సోదాలు చేసి 289 బస్తాల మిర్చిని గుర్తించారు. అలంపూర్ సీఐ రవిబాబు ఆధ్వర్యంలో మిర్చి బస్తాలను బుధవారం బాధితుడికి అప్పగించారు. మిగిలిన బస్తాలను కూడా గుర్తించి బాధితుడికి న్యాయం చేస్తామని సీఐ వివరించారు. వ్యాపారి రైతుల నుంచి మిర్చి బస్తాలు కొనుగోలు చేసిన తర్వాత గోదాంలో రైతుల పేరున ఉన్న బాండ్లలో తన పేరును నమోదు చేయించుకోలేదని.. రైతులు వచ్చి అడుగుతారనే ఉద్దేశంలో కోల్డ్స్టోరేజీ యాజమాన్యం సంచులు ఇవ్వలేదని సీఐ రవిబాబు తెలిపారు.