● దరఖాస్తుకు జూలై 7 వరకు అవకాశం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): బంజారాహిల్స్లోని ఎస్సీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందేందుకు సివిల్స్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకురాలు సునీత, ఎస్సీ స్టడీ సర్కిల్ జిల్లా డైరెక్టర్ శ్రీనివాస్ బుధవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్, బంజారాహిల్స్, హైదరాబాద్లో 2025–26 సంవత్సరానికి నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఉచిత శిక్షణ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు వెబ్సైట్ http://tsstudycircle.co.inలో బుధవారం నుంచి జూలై 7వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులను చేసుకోవాలని కోరారు. శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు. అభ్యర్థులు జనరల్/ ప్రొఫెషనల్ డిగ్రీలో ఉత్తీర్ణులై, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించరాదని, ఎలాంటి ఉద్యోగం చేయకూడని వారు అర్హులని తెలిపారు. ప్రవేశ పరీక్ష హైదరాబాద్, ఎంపిక చేయబడిన ఇతర సెంటర్లలో జూలై 13న ఉంటుందని, పరీక్షలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పద్ధతిలో ఎస్సీలకు 75శాతం, ఎస్టీలకు 10శాతం, బీసీలకు 15శాతం ప్రకారం ఎంపిక చేస్తారని, అమ్మాయిలకు 33.33శాతం సీట్లు రిజర్వ్ అయి ఉంటాయని తెలిపారు. ఇతర వివరాలకు 040– 23546552, 8121626423 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
రేపు మంత్రి పొన్నం రాక
పాలమూరు: జిల్లాకేంద్రంలో ఈనెల 20న రాష్ట్ర రవాణా, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆర్టీఏ, ఆర్టీసీ, బీసీ వెల్ఫేర్ శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అధికార యంత్రాంగంతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు సైతం ఈ సమావేశానికి హాజరుకాన్నారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు సమీక్ష సమావేశానికి సన్నద్ధం అవుతున్నారు.
ఉల్లి క్వింటాల్ రూ.2,100
దేవరకద్ర/జడ్చర్ల: ఉల్లి సీజన్ తగ్గిపోవడంతో బుధవారం దేవరకద్ర మార్కెట్కు ఉల్లి రావడం తగ్గింది. ఐదు నెలలుగా కొనసాగిన ఉల్లి సీజన్ మూడు వారాల నుంచి తగ్గడంతో ధరలు కొంత మేర పెరిగాయి. మార్కెట్కు కేవలం 200 బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. వేలంలో ఉల్లి క్వింటాల్ ధర గరిష్టంగా రూ.2,100, కనిష్టంగా రూ.1,100గా పలికింది. మార్కెట్కు వచ్చిన ఉల్లిని ఎక్కువగా వినియోగదారులే కొనుగోలు చేశారు. వ్యాపారులు బస్తాకు రూ. 50 నుంచి రూ. 100 వరకు లాభం చూసుకుని ఉల్లిని విక్రయించారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,267, కనిష్టంగా రూ.1,569, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,139, కనిష్టంగా రూ.1869 ధర పలికాయి.