
అనుమానిత వ్యక్తులతో అప్రమత్తం
వనపర్తి రూరల్: జిల్లా కేంద్రంలోని పలు కాలనీలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ వెంకటేశ్వరావు అన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా డీఎస్పీ, సీఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో మంగళవారం 11 మంది ఎస్ఐలు, 69 మంది పోలీస్ సిబ్బంది కలిసి సుమారు 200 ఇళ్లల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. నేర రహిత గ్రామాలుగా చేయాలనే ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నామని స్పష్టం చేశారు. అదే విధంగా మాదక ద్రవ్యాలు, గంజాయి, పేలుడు పదార్థాల నిల్వ చేసినట్లు తెలిస్తే కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. పేపర్లు, నంబర్ ప్లేట్లు లేని 40 వాహనాలను సీజ్ చేసి పట్టణ పోలీస్స్టేషన్కు తరలించామన్నారు. సంబంధిత వాహనాల యజమానులు పత్రాలు చూపించి వాహనాలను తీసుకువెళ్లాలని సూచించారు. పాత వాహనాలు కొనేటప్పుడు అన్ని పత్రాలు సరిచూసుకోవాలన్నారు. సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి వాటిని అరికట్టాలని కోరారు. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, వివిధ పోలీస్స్టేషన్ల ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.