మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ‘గత ఏడాది విద్యా సంవత్సరం (2024–25) లో విద్యార్థుల కోసం యూనిఫాం కుడితే మొదటి విడత కుట్టు కూలి మాత్రమే ఇచ్చి, పెంచిన డబ్బులు ఇవ్వకపోతే ఎలా..?’ అంటూ ఓ మహిళా సంఘం సభ్యురాలు ఏకంగా మెప్మా భవనం తలుపులు కొద్దిసేపు మూసివేసి నిరసన తెలిపిన ఘటన తాజాగా వెలుగులో వచ్చింది. గత ఏడాది మహబూబ్ నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీల పరిధిలోని సుమారు 140 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 18 వేల మంది విద్యార్థుల కోసం యూనిఫాం కుట్టడానికి మూడు ఏజెన్సీ (ఎస్హెచ్జీ)లకు మెప్మా అధికారులు పని అప్పగించారు. అప్పట్లో ఒక్కో జతకు రూ.50 మాత్రమే కూలి ఇస్తామనడంతో సరిపోదని ఏజెన్సీ నిర్వాహకులు మొరపెట్టుకున్నారు. దీంతో మరో రూ.25 చొప్పున అదనంగా ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. ఆ మేరకు పని పూర్తి చేసి అప్పగించినా ఇంకా రూ.తొమ్మిది లక్షల వరకు రావాల్సి ఉందని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. విసిగి వేసారిన వారిలోని ఒకరు శ్రీనివాసకాలనీ మహిళా సంఘం సభ్యురాలు సౌధామిని మంగళవారం మధ్యాహ్నం మెప్మా భవనానికి చేరుకుని సీఓలతో వాగ్వాదానికి దిగారు. వారిని బయటకు పంపి తలుపులు మూసివేసి కొద్దిసేపు నిరసన తెలిపారు. తమకు రావాల్సిన డబ్బులు వెంటనే చెల్లించాలని వేడుకున్నారు. చివరకు లెక్కలు తేల్చి త్వరలోనే ఇస్తామని వారు బదులివ్వడంతో ఆమె శాంతించి అక్కడి నుంచి వెనుదిగారు. ఈ విషయమై ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మిని వివరణ కోరగా గత ఏడాదికి చెందిన సుమారు రూ.8.06 లక్షలకు చెక్కు ఇటీవలే డీఆర్డీఏ అధికారులు తమకు ఇచ్చారన్నారు. అయితే ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం రూ.తొమ్మిది లక్షలు రావాల్సి ఉందని అడుగుతున్నారని.. లెక్కల్లో తేడా ఉన్నందున ఇంతవరకు చెల్లించలేదన్నారు. త్వరలోనే వారిని పిలిపించి లెక్కలు సరిచూసి నిబంధనల మేరకు బకాయిలు ఇస్తామన్నారు.
● గత ఏడాదికి సంబంధించిన మిగతా డబ్బులు
రూ.లక్షల్లో పెండింగ్లో ఉంచిన అధికారులు
● మెప్మా భవనం తలుపులు మూసివేసి నిరసన తెలిపిన మహిళా సంఘం సభ్యురాలు